పహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టుల ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తమకు ఉగ్రదాడులతో ఎటువంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్, మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట కాల్పులకు తెగబడింది. జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత సైన్యాన్ని రెచ్చగొట్టేలా ఈ దుశ్చర్యలకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత బలగాలు కూడా ధీటుగా ప్రతిస్పందిస్తున్నాయి. భారత సైన్యం ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాత్రధారులను గుర్తించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్లో భాగంగా బండిపొరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు.
భద్రతా బలగాలు ప్రత్యేక సమాచారం మేరకు బండిపొరా ప్రాంతానికి వెళ్లగా, ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. భారత సైన్యం వారితో ధీటుగా ఎదురుదాడికి దిగింది. ఈ కాల్పుల్లో అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు గాయపడ్డారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మరే విధమైన ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ ఉగ్రదాడులతో విసిగిపోయిన భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా దూసుకుపోతోంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.