అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపిస్తున్నారు. దీనికోసం దేశమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని గుర్తించారు. వారిలో చాలా మందిని వాళ్ల స్వదేశాలకు తరలించారు. ఇటీవలే భారత్కు కూడా మూడు విమానాలు వచ్చాయి. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్లకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారు. వారంతా స్వదేశానికి వచ్చారు.
అయితే, ఇదే సమయంలో అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అమెరికా ఎవరిని బహిష్కరిస్తుంది? ఇప్పుడు బహిష్కరణకు గురవుతున్న వాళ్లు మళ్లీ అక్కడకు వెళ్లొచ్చా? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే వివరాలపై క్లారిటీ ఇస్తూ మైగ్రేషన్ పాలసీ రిపోర్టు కొన్ని వివరాలు వెల్లడించింది. అనధికారికంగా ఉంటున్నవారినే బహిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే, దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితుల్లో బహిష్కరణకు గురికావొచ్చు. అనధికారిక వలసదారులు, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినవారు, వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని వారి దేశాలకు పంపించవచ్చు. తాత్కాలిక వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడే నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని కూడా బహిష్కరించవచ్చు.
అక్రమ వలసదారులే కాకుండా అమెరికాలోని గ్రీన్కార్డు హోల్డర్లు, తాత్కాలిక వీసా హోల్డర్లు కూడా బహిష్కరణకు గురికావొచ్చు. అయితే, ఈ కోవలోకి వచ్చే వక్తులు నేరాలకు పాల్పడినట్లు నిరూపణ కావాలి. ఈ నేరాలలో తాగి వాహనం నడపడం, అనుమతి లేకుండా ఆయుధాలతో దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, తిరగడం, హింసాత్మక నేరాలకు పాల్పడడం వంటివి ఉన్నాయిఅనైతిక చర్యలతో కూడిన నేరానికి పాల్పడిన వ్యక్తిని బహిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది అమెరికాలో నివసించిన మొదటి ఐదేళ్లలో అనైతికంగా భావించే నేరానికి పాల్పడడం, రెండోది వేర్వేరు కేసుల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనైతిక నేరాలకు పాల్పడడం, రెండోదానికి కాలపరిమితి లేదు. అయితే, అనైతిక చర్యలతో కూడిన నేరం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేదు. ఈ విషయంపై అమెరికా కోర్టులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో మోసం, వ్యక్తులు లేదా ఆస్తికి హాని కలిగించే ఉద్దేశం, మరణం లేదా దోపిడీకి కారణమయ్యే వారు, భార్యాభర్తల మధ్య హింస మొదలైనవి వీటి కిందకు వస్తున్నాయి.
అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)కి చెందిన ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్వో) అధికారులు దేశంలో వలస చట్టాలను అమలు చేసే పనిలో ఉంటారు. ఈ అధికారులు నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తుంటారు. ఇమిగ్రేషన్ అమలు ప్రక్రియ అన్ని దశలను ఈఆర్వో నిర్వహిస్తుంది. బహిష్కరణకు అర్హత ఉన్నవారి గుర్తింపు, అరెస్టు, నిర్భంధం, వారి దేశాలకు తిరిగి పంపించే ప్రక్రియ తదితర అంశాలు ఉంటాయి. ఇక బహిష్కరణకు అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి టార్గెటెడ్ గూఢచార కార్యకలాపాలను ఈఆర్వో నిర్వహిస్తుంది. క్రిమినల్ అరెస్ట్ వారెంట్లను అమలు చేయడం, బహిష్కరణకు అర్హత ఉన్న వ్యక్తుల అరెస్టులతోపాటు ఇమ్మిగ్రేషన్ సంబంధిత క్రిమినల్ చర్యల కోసం ప్రాజిక్యూషన్ ప్రారంభించే అధికారం ఈఆర్వోకు ఉంది.