-
ఫైటర్ జెట్లతో గగన స్వాగతం
సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సౌదీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రధాని ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్లు విమానాన్ని ఎస్కార్ట్ చేస్తూ ప్రత్యేక స్వాగతం పలికాయి.
విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో ఈ గగన స్వాగత దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ హై ప్రొఫైల్ ఎస్కార్ట్ ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే ప్రధాన అజెండా.
ఇటీవల ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య జరిగిన చర్చలతో పలు కీలక ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో, ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న భారత్-సౌదీ అరేబియాల మధ్య సంబంధాలను ఈ పర్యటన మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.