ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. తొలి ప్రతిని లోకేష్ చేతుల మీదుగా ప్రధాని అందుకున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్.. తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్ర స్పెషల్ ఎడిషన్ను ఆవిష్కరింపజేశారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుందంటున్నారు .
2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది.
పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి.. ఆ తర్వా ఓ పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబ సభ్యులను ప్రధాని ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు.