హైదరాబాద్ చార్మినార్ దగ్గర్లోని గుల్జార్ హౌజ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, అనంతర పరిస్థితుల గురించి అధికారులు, మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.
మరోవైపు.. ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సౌత్జోన్ డీసీపీ స్నేహా మిశ్రా తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6.16 గంటల సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని పొన్నం చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది మరణించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు జరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాద తీవ్రతను తగ్గించారని చెప్పారు.
ఫైర్ సిబ్బంది పనితీరుపై కిషన్ రెడ్డికి కాంప్లెయింట్ :
చార్మినార్ గుల్జార్హౌస్ వద్ద అగ్ని ప్రమాద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా.. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.