రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. కొద్దిసేపటి క్రితం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుసేన శిక్షణ కేంద్రానికి చేరుకున్నారు.
దక్షిణాదిలో శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఏటా హైదరాబాద్ కు రావటం ఆనవాయితీగా వస్తోంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి బస చేయనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ ఇక్కడ బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము దక్షిణ భారత దేశంలో జరిగి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ముర్ము ప్రారంభిస్తారు. 20న (శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం నిర్వహిస్తారు.