తిరుమల గిరులపై శనివారం నుంచి రాజకీయ ప్రసంగాలను నిషేధించారు. ఎవరైన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ వర్గాలు హెచ్చరించారు. ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్ధానం ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాల నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయాన్ని శనివారం నుంచి అమలు చేస్తున్నారు. రాజకీయ వర్గాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా పెంగ్ తుఫాను కారణంగా శుక్రవారం రాత్రి నుంచి తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావం వల్ల బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తిరుమల అంతా దట్టంగా పొగమంచు కమ్ముకుని చలి తీవ్రత పెరిగింది. తిరుమలకు వచ్చిన భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని దేవస్ధానం అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా ఘాట్ రోడ్డులో వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.