తొక్కిసలాట లో ఆరుగురు మరణించడంతోపాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో బాలయ్య అనే అడ్వకేట్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. అలాగే తొక్కిసలాట ఘటనపై 30 రోజుల్లో నివేదికను గవర్నర్ కి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో అడ్వకేట్ బాలయ్య పిల్లో పేర్కొన్నారు. బాలయ్య వేసిన పిల్ ని స్వీకరించిన న్యాయస్ధానం ఈ నెల 17న అత్యవసర కేసును విచారించే ధర్మాసము ముందు ఈ పిల్ ను ఉంచాలని రిజిస్ట్రార్ను సీజే ధర్మాసనం ఆదేశించింది. భవిష్యత్తులో దేవాలయాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పిల్లో పొందుపరచారు. టిటిడి అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసులాట జరిగి మరణాలు చోటుచేసుకున్నాయని పిల్లో పేర్కొన్న పిటిషనర్ వారందరినీ బాధ్యుల్ని చేయాలని పిల్లో న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు.