జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న స్నేహబంధంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి మాదిరిగానే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసినప్పటికీ తాను మాత్రం రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగే కంటే.. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకుంటే.. జాతీయ స్థాయిలో మరింత పాపులర్ కావొచ్చని, అలాగే, తన జనసేన పార్టీని కూడా జాతీయ స్థాయిలో బలపేతం చేయవచ్చని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. ఆ దృష్టితోనే తన సోదరుడు నాగబాబును పట్టుబట్టి మరీ ఎమ్మెల్సీని చేశారని, రేపో మాపో మంత్రి పదవి కూడా వస్తుందని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నాగబాబు పర్యవేక్షణ సరిపోతుందని పవన్ కల్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీ అభిమానులు, కాపు సామాజికవర్గం ప్రతినిధులు, ప్రత్యేకించి తన ఫ్యాన్స్ తనను ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ, అనుభవం ఉన్న చంద్రబాబు ఉన్న సమయంలో తనకు సీఎం పదవి వచ్చే అవకాశం లేదని పవన్కల్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారట. చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను కేంద్ర మంత్రిగా వెళ్తే రాష్ట్రానికి కూడా తనవల్ల ప్రయోజనం చేకూరుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ తన సోదరుడు నాగబాబును మంత్రిని చేస్తే ఆయన పార్టీతో పాటు కూటమి నేతలకు దగ్గరగా ఉండే అవకాశముంటుందని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఆరోవేలుగా అందరూ అభివర్ణిస్తారు.మంత్రికి మించి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకించి ఎటువంటి అధికారాలుండవు. అదే కేంద్ర మంత్రి అయితే ముఖ్యమంత్రితో సమానమైన హోదా ఉంటుంది. దీంతో పాటు ప్రొటోకాల్ కూడా ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, తనను అభిమానించడం వల్లనే కొంత ప్రాధాన్యత ఇస్తున్నా ఈ పదవి అంటేనే పవన్ కల్యాణ్కు మొహం మొత్తిందని అంటున్నారు. ఇక్కడే ఎన్నాళ్లు చేసినా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది తప్ప ఎదుగుదల ఉండదని, అదే మోదీ కేబినెట్ లోకి వెళితే కొంత ఇమేజ్ కూడా పెరుగుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకమే పవన్లో ఈ ఆలోచన రావడానికి కారణంగా చెబుతున్నారు. అందుకే.. పవన్ కల్యాణ్ బీజేపీ లైన్ లోకి వెళ్లారంటున్నారు. సనాతన ధర్మం అంటూ ఆయన నినాదాన్నిచేయడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. మరొకవైపు నరేంద్ర మోదీకి కూడా తనంటే మంచి అభిప్రాయం ఉంది. మోదీ గుడ్ లుక్స్లో ఉన్నారు. ఈ సమయంలో మోదీ కేబినెట్లో మంత్రిగా చేరితే కొంత వెసులుబాటు దొరుకుతుందని, రాష్ట్ర రాజకీయాలకు అవసరమైతే తర్వాత రావచ్చన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.