ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు తప్పితే.. పవన్ కల్యాణ్కు సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదని పాల్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాష్ర్టంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని అన్నారని, ఇప్పడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని కేఏ పాల్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమన్నారు పాల్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తొత్తులని విమర్శించారు. తనకు అధికారం వస్తే రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను కేవలం యేడాది కాలంలోనే పరిష్కరిస్తానన్నారు కేఏ పాల్.
ఇక, వైసీపీ అధినేత జగన్పైనా కేఏ పాల్ సెటైర్లు వేశారు. అసెంబ్లీకి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి 11 నిమిషాలు మాత్రమే ఉండటం విచారకరమన్నారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని సలహా ఇచ్చారు.