భారత్ ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తుందోనన్న భయంలో ఉంది పాకిస్థాన్. ఆ భయంలోనే అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే లాహోర్, ఇస్లామాబాద్ను నో ఫ్లై జోన్గా ప్రకటించింది పాకిస్థాన్. కమర్షియల్, మిలటరీ విమానాలపై ఈ ప్రాంతంలో నిషేధం విధించింది. ఈ నిషేధం రేపటి వరకు అమల్లో ఉండనుంది. మరోవైపు భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాక్ ఆర్మీ కొన్ని ఫార్వర్డ్ పోస్టులను వదిలేసి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని పోస్టులపై పాకిస్థాన్ జెండాలను వదిలేసి.. ముందు జాగ్రత్తగా వెనక్కి వెళ్లిపోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ హైఅలర్ట్లో ఉంది. ఓవైపు యుద్ధానికి సన్నద్ధమవుతూనే… మరోవైపు భారత్ ఏ ప్రాంతాలపై దాడులు చేస్తుందో గుర్తించి వాటిని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే POK నుంచి టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్స్ను ఖాళీ చేయించింది పాక్ ఆర్మీ. తాజాగా ఇండియా మోస్ట్ వాంటెడ్, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు భారీ సెక్యూరిటీ కల్పించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికే లాహోర్లో హఫీజ్ సయీద్ దాక్కున్న స్థలాన్ని గుర్తించింది భారత్. అతడి ఇంటి వీడియోలు కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హఫీజ్ సయీద్ ఉంటున్న ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించినట్లు తెలుస్తోంది. భారత్ అతడిపై దాడులు చేస్తుందన్న భయంతో ఈ చర్యలన్ని చేపట్టినట్టు సమాచారం.
మరోవైపు రఫేల్స్ ఫైటర్ జెట్స్ POK సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. నాలుగు యుద్ధవిమానాలు గగనతలంలో కనిపించగానే పాక్ వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే తమపై 36 గంటల్లో భారత్ దాడులు చేస్తోందని అక్కడి మంత్రులు జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహించడంతో దాడుల గురించే అనుకొని వణికిపోయింది పాకిస్థాన్. ఇండియా దాడి చేసే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించింది.
పాక్ అంచనాలకు అందలేదు మోదీ ఆలోచనలు అనే చెప్పాలి. వరుస భేటీలు నిర్వహించిన అనంతరం అసలు ఉగ్రదాడికి సంబంధించిన అంశాన్నే ప్రకటించలేదు. దీంతో పాక్ మరింత షాక్ అయ్యిందనే చెప్పాలి. క్లారిటీ లేకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఇండియా ఎలా రివేంజ్ తీసుకుంటుందో అనే భయం మరింత ఎక్కువైంది ఇప్పుడు పాకిస్థాన్కు.