పహల్ గామ్ ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రదాడులను, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతోంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకునేందుకు భారత్ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్ ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు. మీడియా ఇంటర్వ్యూలో సింధు జలాలు పాక్కు రాకుండా నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని పశ్నించగా ఈ విధంగా బదులిచ్చారు. ఒకవేళ భారత్ ఆ పనిచేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుందన్నారు.
గత నెల 22న పెహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. నీటిని పాక్కు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాక్ మంత్రి పైవిధంగా వ్యాఖ్యానించారు.
పాక్పై భారత్ దాడికి పాల్పడితే అందుకు రెట్టింపు స్థాయిలో బదులిస్తామని ఇటీవలే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ రానున్న 24-36 గంటల్లో సైనిక చర్యకి దిగుతుంది. అదే కనుక జరిగితే న్యూఢిల్లీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని బుధవారం పాక్ రక్షణ మంత్రి ఒక ప్రకటనలో హెచ్చరించారు.
దేశంలో రాజకీయ అస్థిరత, ఆర్థిక ఒడిదుడుకులు, భద్రతా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ పాలకులు యుద్ధోన్మాదం దిశగా ప్రకటనలు చేస్తున్నారని ఆదేశ విపక్షాలు విమర్శిస్తున్నాయి.