పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, బలోచిస్థాన్, ఇండియన్ ఆర్మీ, హిందూవులు, రెండు దేశాల సిద్ధాంతంపై కాసేపు లెక్చర్ ఇచ్చారు. ఇప్పుడీ లెక్చర్లోని కొన్ని అంశాలు ఇరు దేశాల సంబంధాలపై మరోసారి ప్రభావం చూపే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది.
కశ్మీర్ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాంతం తమ జీవనాడి అన్నారు. దాన్ని వదిలే ప్రసక్తే లేదని.. అక్కడ పోరాడుతున్న వారికి న్యాయం జరుగుతుందన్నారు. దీంతో ఆయన మాటలు కుక్కతోక వంకర అనే సామెతను గుర్తుకు తెస్తున్నాయి. కశ్మీర్ గురించి ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికల్లో అనేక సార్లు గొంతెత్తి భంగపడటంతో.. ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించలేని వేదికను చూసుకొని పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
బలూచిస్థాన్ వేర్పాటువాదులపై కూడా తీవ్ర వ్యాక్యలు చేశారు. బలూచిస్థాన్ ఎప్పటికీ పాక్ అంతర్భాగమే అని.. మరో 10 తరాలు పోరాడిన కానీ వారు పాక్ నుంచి ఆ ప్రాంతాన్ని వేరు చేయలేరన్నారు. త్వరలోనే బలూచ్ పోరాటం ఆగిపోతుందన్నారు ఆయన.
ఇక హిందూవులను కూడా టార్గెట్ చేశారు. హిందూవుల సిద్ధాంతాలు, పద్ధతులు వేరని.. అందుకే మన పూర్వీకులు ప్రత్యేక దేశం కోసం పోరాడారని.. వారి పోరాటాన్ని మనం వృథా చేయవద్దన్నారు. విదేశాల్లో ఉన్న రాయబారులు.. తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలను చెప్పాలన్నారు. హిందూవులు, మనం వేరు కాబట్టే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది పడిందన్నారు మునీర్.
ఇండియన్ ఆర్మీ గురించి కూడా ప్రస్తావించారు పాక్ ఆర్మీ చీఫ్. 13 లక్షల మంది బలమైన భారత సైన్యమే మనల్ని ఏమీ చేయలేకపోయింది.. ఇక పాక్ లోపల ఉన్న ఉగ్రవాదులు ఏం చేస్తారన్నారు.
మొత్తంగా చూస్తే పాక్ ఆర్మీ చీఫ్ ప్రసంగం.. పాక్ సామాన్యమైనది కాదంటూనే.. ప్రతి విషయంలో భారత్తో పోలుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకటి మాత్రం అర్థమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని పెంచడమే కానీ.. తగ్గించే ఆలోచన పాక్ ఆర్మీకి అస్సలే లేదని.