-
ఏంటీ రెసిస్టెన్స్ ఫ్రంట్?
-
ఎందుకు పుట్టింది? ఎప్పుడు పుట్టింది?
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తామే చేసినట్లు టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధంగా ఆవిర్భవించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్-టీఆర్ఎఫ్.. ఇప్పుడు పహల్గామ్లో అమానవీయ దాడికి పాల్పడింది. పర్యాటకులనే లక్ష్యంగా చేసుకొని.. పక్కా ప్లాన్తో దాడిచేసి 26 మందిని బలి తీసుకుంది.
కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏర్పడింది. 2019లో ఈ సంస్థ ఉనికి మొదలయ్యింది. మొదట ఆన్లైన్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ సంస్థ పనిచేసేది. ఆ తర్వాత ఆరు నెలలకే భౌతిక ఉగ్రవాద గ్రూపుగా ఏర్పాటయ్యింది. టీఆర్ఎఫ్ వెనుక పాకిస్తాన్ ఉంది. అయితే, లష్కరే తోయిబా అనుబంధం అని చెబుతున్నప్పటికీ.. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ.. ఈ కొత్త ఉగ్రవాద సంస్థను సృష్టించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు.
2019లో మొదలయినప్పటినుంచీ టీఆర్ఎఫ్ దాడులకు తెగబడుతోంది. ప్రధానంగా కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పలు అసాంఘిక కార్యకలాపాల్లో దీని ప్రమేయంపై ఆధారాలు దొరికాయి. దీంతో, 2023లో భారత ప్రభుత్వం టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థల జాబితాలో చేర్చింది. ఈ టీఆర్ఎఫ్ను సృష్టించింది సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. సజ్జాద్ కశ్మీరీ మిలిటెంట్? శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి కుట్ర పన్నింది సజ్జాదే. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్గా పని చేశాడు. టీఆర్ఎఫ్లో పనిచేసే వారిలో సాజిద్ జాట్, సలీం రెహ్మానీ ఉన్నారు. వీరిద్దరూ గతంలో లష్కరేలో పనిచేసిన వారే.
ఇప్పటిదాకా టీఆర్ఎస్ చేసిన దాడులు :
- 2020 ఏప్రిల్ 1: కుప్వారాలోని కేరన్ సెక్టార్లో నాలుగు రోజులపాటు జరిగిన ఎదురు కాల్పుల సమయంలో మొదటిసారి టీఆర్ఎఫ్ పేరు బయటకు వచ్చింది.
- 2020 అక్టోబరు 30: దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారు. భాజపా కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు.
- 2020 నవంబరు 26: శ్రీనగర్లోని లాయేపోరాలో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలపై దాడిచేసి ఇద్దరు సైనికులను హత్య చేశారు.
- 2023 ఫిబ్రవరి 26: పుల్వామాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ను టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు చంపేశారు.
- 2024 అక్టోబరు 20: గండేర్బల్లోని సోన్మార్గ్లో డాక్టర్తో పాటు.. ఆరుగురు కార్మికులను హత్య చేశారు.
- 2025, ఏప్రిల్ 22 : పహల్గామ్లో ఘోరమైన ఉగ్రదాడి. 26 మంది టూరిస్టులను హత్యచేసిన టీఆర్ఎస్ టెర్రరిస్టులు.