27.6 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు… ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ… : రేవంత్‌రెడ్డి ధ్వజం

  • మోదీ ర‌హ‌స్య అజెండా అది
  • హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
  • తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం
  • సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహర‌ణ‌
  • మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే నినాదం.. నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ అనే విధాన‌మ‌ని.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ర‌హ‌స్య అజెండా అదే అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మ‌రో అంశ‌మ‌ని.. కుటుంబ నియంత్ర‌ణ విధానంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోల్చితే ద‌క్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాజ్యాంగం ప్ర‌సాదించిన గ్యారంటీల‌ను, మ‌న హక్కుల‌ను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు చేతులు క‌ల‌పాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్ర‌మే కాద‌ని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌ప్న‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ను భార‌త దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే అత్యుత్తుమంగా నిల‌పాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్‌.. విజ‌న్ -2050, ద‌క్షిణాది రాష్ట్రాలు ఎందుకు క‌లిసి ప‌ని చేయాల‌నే దానిపై ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందిని, 60 ఏళ్ల క‌లను నెర‌వేర్చినందున తెలంగాణ ప్ర‌జ‌లు సోనియా గాంధీని ఎంత‌గానో ప్రేమిస్తున్నారని రేవంత్ చెప్పారు. త‌న ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ కోసం చేసింది ఏం లేదన్నారు. ఆ పార్టీ నాయ‌కులు ఎన్నో వాగ్దానాలు చేశారే త‌ప్ప వాటిని నెర‌వేర్చ‌లేదని దుయ్యబట్టారు. తెలంగాణ జీడీపీ సుమారు 200 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉందని, 2035 నాటికి దానిని ఒక మిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా మార్చాల‌నుకుంటున్నామన్నారు. తెలంగాణ‌ను హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ అనే మూడు జోన్లుగా విభ‌జించామన్నారు. 160 కిలోమీట‌ర్ల పొడ‌వైన అవుట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని కోర్ అర్బ‌న్ ఏరియాలో 1.2 కోట్ల ప్ర‌జ‌లు నివసిస్తున్నారని, ఈ ప్రాంతం సాఫ్ట్‌ వేర్‌, ఫార్మా రంగాల‌కు కేంద్రంగా ఉందన్నారు. చార్మినార్‌, హైద‌రాబాద్ బిర్యానీ, ముత్యాల‌కు హైద‌రాబాద్ ప్ర‌సిద్ధి అని గుర్తు చేశారు.ఓఆర్ఆర్ ప‌రిధిలోని ఈ కోర్ అర్బ‌న్ ఏరియాను స‌ర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయ‌నున్నామన్నారు తెలంగాణ సీఎం. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామన్నారు. దేశంలోని ముంబ‌యి, ఢిల్లీ, బెంగ‌ళూర్‌, చెన్నై వంటి న‌గ‌రాల‌తో కాకుండా ప్ర‌పంచంలోని ముఖ్య న‌గ‌రాలైన న్యూయార్క్‌, లండ‌న్‌, సింగ‌పూర్‌, టోక్యో, సియోల్ వంటి న‌గ‌రాల‌తో పోటీప‌డేలా హైద‌రాబాద్ ఉండాల‌నుకుంటున్నామని చెప్పారు.

30 వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీ నిర్మిస్తున్నామని, ఇది భార‌త‌దేశంలోని పూర్తి హ‌రిత‌, ప‌రిశుభ్ర‌మైన‌, అత్యుత్త‌మ‌మైన న‌గ‌రంగా ఉండ‌నుందన్నారు. ప్ర‌పంచంలోని మ‌రే న‌గ‌రంతో పోల్చుకున్నా ఇది స‌రైన ప్ర‌ణాళిక‌, జోన్లు ఉన్న న‌గ‌రంగా ఉండ‌నుందన్నారు. అలాగే ఇది మొట్ట‌మొద‌టి నెట్ జీరో సిటీ అని చెప్పారు. ఫ్యూచ‌ర్ సిటీలో తాము ఏఐ సిటీని కూడా నిర్మిస్తున్నామని.. యువ‌త కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో తాను పాల్గొన్నానని, ఒక లక్షా 82వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌కు తీసుకురాగ‌లిగామని చెప్పారు. గ‌తేడాది రూ.40 వేల పెట్టుబ‌డులు వ‌చ్చాయని, బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌నా కాలంలో మొత్తం రూ.25 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను కూడా సాధించ‌లేక‌పోయిందని విమర్శించారు. హైద‌రాబాద్ ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త‌కుగానూ మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టు చేప‌ట్టామని.. మూసా… ఈసా న‌దుల క‌ల‌యికే మూసీ… గ‌త యాభై ఏళ్లుగా కాలుష్యం కోర‌ల్లో చిక్కి మూసీ క‌నుమ‌రుగయ్యే స్థితికి చేరిందన్నారు. తమ ప్ర‌భుత్వం మూసీకి పూర్వ వైభ‌వం తేవాల‌నుకుంటోందని చెప్పారు. గోదావ‌రి నీటిని మూసీలో క‌ల‌ప‌డం ద్వారా త్రివేణి సంగమంగా మార్చ‌నున్నామని చెప్పారు. అక్క‌డే 200 ఎక‌రాల్లో గాంధీ స‌రోవ‌ర్‌ను నిర్మిస్తున్నామన్నారు.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న రేవంత్‌రెడ్డి.. అందుకే తాము డ్రై పోర్ట్ నిర్మించ‌నున్నామని చెప్పారు. దానిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సీ పోర్ట్‌కు ప్ర‌త్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా క‌లుపుతామన్నారు. హైద‌రాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్య‌మ‌వుతుందన్నారు. అభివృద్ధి మొద‌ట నగ‌రాలతోనే మొద‌ల‌వుతుంద‌నేది నా భావ‌నగా చెప్పారు. హైద‌రాబాద్ రైజింగ్ కావాలంటే అది వేగ‌వంత‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన‌, అవ‌కాశాలు క‌ల్పించే న‌గ‌రంగా ఉండాలన్నారు. తాము రీజిన‌ల్ రింగు రోడ్డును, రీజిన‌ల్ రింగు రైల్వే లైను నిర్మించ‌బోతున్నామని.. ఈ రెండింటిని రేడియ‌ల్ రోడ్ల ద్వారా క‌ల‌ప‌నున్నామని రేవంత్‌ చెప్పారు. తాము ఇటీవ‌ల ఎన‌ర్జీ పాల‌సీని విడుదల చేశామని, ఈవీల‌పై ఉన్న అన్ని ప‌న్నుల‌ను తొల‌గించామన్నారు. ఈవీల అమ్మ‌కాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని 3 వేల ఆర్టీసీ బ‌స్సులను ద‌శ‌ల‌వారీగా ఈవీలుగా మార్చ‌నున్నామన్నారు. ఓఆర్ఆర్‌-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య ఉన్న సెమీ అర్బ‌న్ ఏరియాను ఉత్ప‌త్తి జోన్‌గా మార్చ‌బోతున్నామని.. ఇది చైనా+1 అనే మా వ్యూహానికి ప్ర‌పంచానికి స‌మాధానంగా నిల‌వ‌నుందన్నారు. ఔష‌ధాలు, విత్త‌నాల ఉత్ప‌త్తిలో తెలంగాణ ముందువ‌రుస‌లో ఉందన్నారు. వాటికి అద‌నంగా ఎఫ్ఎంసీజీ, ర‌క్ష‌ణ‌, రాకెట్స్‌, స్పేస్‌, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, గ్రీన్ ఎన‌ర్జీ రంగాల్లో ముందు వ‌రుస‌లో నిల‌వాల‌నుకుంటున్నామని చెప్పారు. భార‌త‌దేశానికి డాటా సెంట‌ర్ హ‌బ్ గా, పంప్ స్టోరేజీ హ‌బ్‌గా తెలంగాణ నిల‌వ‌నుంది. దేశంలోని ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌కు అనుసంధానమై, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంట‌ర్‌గా ఉండాల‌ని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ వెలుప‌ల నుంచి రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న గ్రామాల‌ను మార్చాల‌నుకుంటున్నామని.. గ్రామాల్లోనూ అత్యుత్త‌మ వ‌స‌తులు క‌ల్పిస్తామని చెప్పారు. రైతుల‌కు 24 గంట‌లు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇస్తున్నామని, రైతుల‌కు ఎక‌రాకు రూ.12 వేలు రైతు భ‌రోసా ఇస్తున్నామని, భూమి లేని కుటుంబాల‌కు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామని, పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు క్వింటాకు రూ.500 బోన‌స్ ఇస్తున్నామని రేవంత్‌ చెప్పారు. దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ అని గర్వంగా చెప్పారు. 25 లక్ష‌ల రైతు కుటుంబాల‌కు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశామన్నారు. కేవ‌లం మౌలిక వ‌స‌తుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదని, రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, పిల్ల‌లు, వ‌యోధికుల అంద‌రి విష‌యంలోనూ మేం దృష్టి పెడుతున్నామన్నారు. తెలంగాణ రైజింగ్‌లో వారూ భాగ‌మే అన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లో రూ.10 ల‌క్ష‌ల మేర హెల్త్ క‌వ‌రేజీ ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ‌లో ఎవ‌రైనా ఏ ఆసుప‌త్రికి వెళ్లినా మేం చూసుకుంటున్నామన్నారు. విద్యా, నైపుణ్యాలు నా ప్ర‌థ‌మ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, అన్ని గురుకులాల్లో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల‌ను రెట్టింపు చేశామన్నారు. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ‌లో మ‌హిళ‌లంద‌రికీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించామని, అక్కాచెల్లెళ్లు ఇప్ప‌టికే కోట్లాది బ‌స్సు ప్ర‌యాణాలు ఉచితంగా చేశారని చెప్పారు. ఎంతో డ‌బ్బును ఆదా చేసుకున్నారని, అక్కా చెల్లెళ్ల‌కు రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తున్నామని, ఇళ్ల‌కు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రేవంత్‌ సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామని, ప్ర‌తి సంవ‌త్స‌రం నాలుగు ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించ‌నున్నామని చెప్పారు. 20 ల‌క్ష‌ల పేద కుటుంబాలు సొంత ఇళ్ల క‌ల నెర‌వేరుతుంద‌ని నేను హామీ ఇస్తున్నానన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానమని… ద‌ళితులు, ఓబీసీలు, గిరిజ‌నులు, మైనారిటీల‌కు సామాజిక న్యాయం చేస్తామ‌ని తమ నాయ‌కుడు రాహుల్ గాంధీ అభ‌య‌మిచ్చారన్నారు.

స‌మ‌గ్ర కుల స‌ర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌.. దానిని అసెంబ్లీలోనూ ప్ర‌వేశ‌పెట్టామన్నారు. జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక‌న వ‌న‌రులు స‌మ‌కూర్చుతామన్నారు. వ‌ర్గీక‌ర‌ణ కోసం 30 ఏళ్లుగా మాదిగ సోద‌ర సోద‌రీ మ‌ణులు పోరాడుతున్నారని, వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని తాము 2024, ఫిబ్ర‌వ‌రి 4న నిర్ణ‌యం తీసుకున్నామని చెప్పారు. 2025, ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌త్యేక శాస‌న‌స‌భ స‌మావేశం ఏర్పాటు చేసి దాని అమ‌లుకు తీర్మానం చేశామన్నారు. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్స‌వంగా జ‌రుపుకోనున్నామని చెప్పారు. సుప‌రిపాల‌న ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఆర్థిక స‌ర్వే నివేదిక ప్ర‌కారం అతి త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌ అని చెప్పారు. అలాగే, గ్లోబ‌ల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్ర‌కారం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో వినియోగంలో తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలోనూ తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com