ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల రిటైర్మెంట్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, ఆశోక్ బాబు, దువ్వారపు రామారావుల పదవీకాలం ఈ నెలాఖరులోపే పూర్తి కానుంది. వీటిలో ఒకటి జనసేన నుంచి నాగబాబుకు, ఒకటి బీజేపీకి కేటాయిస్తే కనుక టీడీపీ నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కనుంది. బీజేపీకి ఒక సీటు ఇవ్వకపోతే మిగతా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ నేతల్ని వరించనున్నాయి.
అదే విధంగా తెలంగాణలో 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మీర్జా హసన్ ల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఎలక్షన్ కమిషన్ మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
మార్చి 29వ తేదీన తెలంగాణలో 5 గురు ఎమ్మెల్సీలు, ఏపీలో 5 గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దాంతో, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పదవీకాలం ముగియనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు :
- ఎన్నికల నోటిఫికేషన్ – మార్చి 3, 2025
- నామినేషన్లకు చివరి తేదీ – మార్చి 10, 2025
- నామినేషన్ల పరిశీలన – మార్చి 11, 2025
- నామినేషన్ల ఉపసంహరణ గడువు – మార్చి 13, 2025
- పోలింగ్ తేదీ – మార్చి 20, 2025 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చి 20, 2025 సాయంత్రం 5 గంటలకు