రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన
మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తొలగింపు
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నివేదించారు. పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండటంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలిపారు.
రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.