గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకల విధానాల వల్ల, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం కారణంగా అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు ఎప్పుడూ నిర్ణీత గడువు ప్రకారం జీతాలు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని కానీ మా ప్రభుత్వం వచ్చాక 52వేల కోట్ల అప్పు తెచ్చామని… మేమొచ్చాక సంక్షేమ పధకాలకు 61 వేల కోట్లు వెచ్చించామని భట్టి వివరించారు. అనేక పథకాలకు బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అడ్డగోలుగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలంతా వ్యతిరేకించినా బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మించి పెద్ద తప్పు చేసిందని డిప్యూటీ సీయం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ జాప్యం కారణంగా భద్రాద్రి ప్రాజెక్టు వ్యయం 42 శాతం అదనంగా పెరిగిందని వివరించారు. విద్యుత్ రంగంపై బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారాన్ని మేము సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం విద్యుత్ వినియోగం పెరిగినా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. విద్యుత్ పై సమగ్ర సమాచారం ప్రజల ముందు పెట్టామని ఉత్పత్తి కేంద్రాల సమాచారం కూడా ప్రజలకు వివరించామని డిప్యూటీ సీయం భట్టి తెలిపారు. కొత్త విద్యుత్ విధానం త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.