నాగబాబు ఒకప్పుడు సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా అందరికీ తెలుసు. ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడైపోయారు. ఇన్నాళ్లు జనసేన పార్టీ డెవలప్మెంట్లో తెర వెనుక నుంచి కీలక పాత్ర పోషించిన నాగబాబు.. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు.
తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచీ నాగబాబు బిజీగానే ఉంటున్నారు. జనసేన కార్యకలాపాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా కడిగి పడేస్తున్నారు. అలా.. జనసేన పురోగతిలో కీలక పాత్ర పోషిస్తో్న సోదరుడు నాగబాబుకు పవన్ కల్యాణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న చంద్రబాబును ఒప్పించి తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు.
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా నాగబాబు.. నిబంధనల మేరకు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. నామినేషన్తో పాటు.. ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించారు. అయితే, ఆ అఫిడవిట్లో అన్న చిరంజీవికి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తాను అప్పు ఉన్నట్లు నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలోనూ చర్చనీయాంశంగా మారింది. నాగబాబు అఫిడవిట్ పరిశీలిస్తే.. ఆయనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో మొత్తం రూ.55.37 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. నాగబాబు చేతిలో ప్రస్తుతం రూ.21.81 లక్షల నగదు ఉండగా, బ్యాంకుల్లో రూ.23.53 లక్షలు డిపాజిట్గా ఉన్నాయి. అలాగే, ఇతరులకు రూ.1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఆయన వద్ద రూ.67.28 లక్షల విలువైన బెంజ్ కారు, రూ.11.04 లక్షల విలువైన హ్యుందాయ్ కారు ఉన్నాయని వివరించారు. నాగబాబు తన వద్ద రూ.18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం, రూ.16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, ఆయన భార్య వద్ద రూ.57.9 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ.21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నాయని తెలిపారు. మొత్తం రూ.59.12 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా భూమి వివరాలు కూడా అఫిడవిట్లో పొందుపరిచారు. రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రూ.3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్లో రూ.32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, మరో రూ.50 లక్షల విలువైన 5 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ.53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిగి ఉన్నట్టు పేర్కొన్నాడు. వాటి విలువ రూ.11 కోట్ల వరకు ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అయితే, ఆస్తుల విషయంతో పాటు తనకు అప్పులు కూడా ఉన్నట్లు నాగబాబు తెలిపారు. అన్న చిరంజీవి నుంచి రూ.28.48 లక్షలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.9 లక్షల అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకుల్లో కూడా అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక నాగబాబు అన్న చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు.