పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించింది. అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తుది తీర్పును చదివి వినిపించారు.
అల్ ఖాదిర్ ట్రస్టు కేసు వివరాల్లోకి వెళితే… లండన్ లో ఉంటున్న పాకిస్థాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్థాన్ కు పంపగా… ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్ మాల్ చేశారనేది వారిపై ఉన్న ఆరోపణ.
ఆ సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా… సుప్రీంకోర్టు అంతకు ముందు రియాజ్ హుసేన్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టించారనేది వీరిపై ఉన్న అభియోగం. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పబోతున్న అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి 57 ఎకరాలను రియాజ్ హుస్సేన్ ఇచ్చినట్టు చెపుతున్నారు.
ఇమ్రాన్ పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు ఉన్నాయి. 2023 ఆగస్ట్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ జైలుశిక్షతో మరింత కష్టాల్లో కూరుకుపోయారు ఇమ్రాన్ఖాన్. ఆయనకు బయట ఎంత ఫాలోయింగ్ ఉన్న.. ప్రస్తుత ప్రభుత్వం ఆయనను చట్టపరంగా లాక్ చేస్తోంది. ఆయనను జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో దోషిగా ఉన్నారు. మరికొన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది.
అల్ ఖాదిర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ 1996లో స్థాపించారు ఇమ్రాన్ ఖాన్ దంపతులు. ఫౌండేషన్ చాటున అక్రమాలు జరిగినట్టు పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో.. 2023 డిసెంబర్లో ఇమ్రాన్ ఖాన్, బీబీతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. జాతీయ ఖజానాకు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేసింది. కోర్టు తీర్పుతో ఇమ్రాన్ మరికొన్నేళ్ల పాటు జైలుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీటీఐ పార్టీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.