- ఆస్పత్రి ని అణువణువునా పరిశీలించిన మంత్రి
- రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు
- టాయిలెట్స్, డ్రైనేజీ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీసిన మంత్రి
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఔట్ పేషెంట్ సేవలు సరిగా అందకపోవడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసుపత్రివర్గాలపై అసహనం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నడవలేని స్ధితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భివిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుడదని సిబ్బందిని హెచ్చరించారు. ఎటువంటి పరిస్ధితుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపించకూడదని స్పష్టం చేశారు. వైద్యసేవలు, నర్సింగ్ స్టాఫ్ ప్రవర్తన తదితర విషయాలపై రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో టాయిలెట్స్, మురుగునీటి వ్యవస్ధ నిర్వహణ దారుణంగా ఉండటంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లోగా ఆసుపత్రి భవనాలతో పాటు పరిసరాలను కూడా శుభ్రపరిచి ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్యకరమైన వాతావరణ నెలకొల్పాలని ఆదేశించారు. ఇక నుంచి పురుషులకు, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ ఆకస్మిక పర్యటనలో ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయవల్సిన మార్పులపై కీలక సూచనలు చేశారు.