మసూద్ అజర్.. ఈ పేరు ప్రతి ఒక్కరికి చాలా సుపరిచతమైన పేరు. ఓ టెర్రరిస్ట్కు ఇంతటి ప్రాముఖ్యత దక్కిందంటే అతను చేసిన దుర్మార్గాలతో పాటు.. పాకిస్థాన్ అతనికిచ్చిన ప్రాధాన్యమే కారణం. అలాంటి మసూద్ అజర్ను ఇటీవల కొందరు హత్య చేశారన్న ప్రచారం జరిగింది. కానీ అదంతా ఉట్టి మాటని తేలింది. ఎందుకంటే మసూద్ అజర్ రీసెంట్గా పాకిస్థాన్లో ఓ బహిరంగ సభ నిర్వహించాడని తెలుస్తోంది. మరి నేనింకా చనిపోలేదని ప్రూవ్ చేసుకోవడానికి బయటికి వచ్చాడా? లేదా మరేదైనా కారణమా? అనేది తేలీదు కానీ మసూద్ అజర్ మాత్రం బతికే ఉన్నాడని ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. భారత్ కూడా మసూద్ అజర్ విషయంలో స్పందించడంతో ఈ క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.
ఇటీవల తాను నిర్వహించిన బహిరంగసభలో భారత్, ఇజ్రాయెల్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్. నిఘా వర్గాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భారతదేశ విదేశాంగశాఖ పాకిస్థాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓ మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. అంతేకాదు ఇప్పటికే మసూద్ అజర్పై అనేక కేసులో ఆధారాలు సమర్పించినా పాక్ నుంచి ఉలుకు, పలుకు లేదు. అంతేగాకుండా అసలు మసూద్ అజర్ తమ దేశంలోనే లేడని బుకాయించింది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడని నిలదీసింది భారత్.
మసూద్ అజర్ జైషే మహ్మద్ చీఫ్గా ఉన్నాడు. పార్లమెంట్పై దాడులు, పుల్వామా అటాక్కు కూడా మసూద్ కుట్ర పన్నాడని ఇండియా ఆధారాలతో సహా పాకిస్థాన్కు అందజేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలంది. కానీ పాక్ మాత్రం తమ దేశంలో మసూద్ లేడని చెబుతూ వస్తోంది. అయితే మసూద్ను సురక్షిత ప్రాంతంలో ఉంచి భద్రత కూడా కల్పిస్తున్నది పాక్ ఆర్మీనే అనే ఆరోపణలు ఉన్నాయి.
మసూద్ అజహర్ ఆంశంలో భారత్ విధానం మారదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. మసూద్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ ఈరోజు తేల్చి చెప్పింది.