అతనో మాజీ డీజీపీ.. కానీ అవేవి అతని చావుకు అడ్డు రాలేదు. ఏకంగా భార్య చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు మాజీ బాస్ మర్డర్ కేసులో ఎన్నో ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ను అతని భార్య పల్లవి హత్య చేసింది. ఈ విషయం ఇప్పటికే ఖరారైంది. కానీ ఎలా చేసింది? ఎందుకు చేసింది? అనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ బెంగళూరు పోలీసులకు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయ్యింది.
ఓంప్రకాశ్ను హత్య చేయడానికి ముందు చంపడం ఎలా? అనే క్వశ్చన్కు ఆన్సర్ తెలుసుకునేందుకు గూగుల్ను ఆశ్రయించింది పల్లవి. ఐదు రోజుల ముందే హత్య ఎలా చేయాలన్న దానిపై గూగుల్లో సెర్చ్ చేసిందని గుర్తించారు. మెడ భాగంలో ఎక్కడ కట్ చేస్తే త్వరగా చనిపోతారని వెతికినట్లు గుర్తించారు. మెడ భాగంలో సిరులు, రక్తనాళాల ఎక్కడుంటాయని సెర్చ్ చేసినట్లు గూగుల్ హిస్టరీని సేకరించారు పోలీసులు.
పక్కా ప్లాన్ ప్రకారమే తన తండ్రిని తల్లి, సోదరి హత్య చేసి ఉంటారని ఓం ప్రకాశ్ కొడుకు కార్తీకేశ్ పోలీసులకు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓం ప్రకాశ్ లంచ్ చేస్తున్న సమయంలో ఈ హత్య జరిగినట్టు తేల్చారు. పల్లవి కావాలనే అతనితో గొడవకు దిగి.. ఆ తర్వాత కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసినట్టు తేలింది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించారు పోలీసులు. సగం తినేసిన ప్లేటును గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు కత్తులు, పగిలిన గాజు బాటిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఓం ప్రకాశ్ హత్యలో కూతురు పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తన తల్లి వారం రోజులుగా చంపుతానని బెదిరిస్తున్నట్టు కార్తీకేశ్ తెలిపినట్టు తెలుస్తోంది. ఈ గొడవ కారణంగానే ఓం ప్రకాశ్ ఇంటిని విడిచి మరో సోదరి ఇంటికి వెళ్లాడని.. కానీ తన చెల్లి కృతి అక్కడికి వెళ్లి బలవంతంగా అతడిని తీసుకొచ్చిందన్నాడు. వారిద్దరు నిత్యం తండ్రితో గొడవపడేవారని పోలీసులకు తెలిపాడు.
ఆస్తి గురించే ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. ఆస్తిలో తనకు, తన కూతురికి ఎలాంటి వాటా ఇవ్వకపోవడంతో వివాదాలు ప్రారంభమయ్యాయని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ హత్య చేయడానికి కొన్ని రోజుల ముందు కూడా పల్లవి ఐపీఎస్ ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా తన భర్తపై ఆరోపణలు చేసినట్టు గుర్తించారు. తన భర్తపై సుమోటో కేసు నమోదు చేయాలని కోరింది. తనపై, తన కూతురిపై గృహ హింసకు పాల్పడుతున్నట్టు ఆమె ఆరోపించింది. తన కూతురికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడని.. తన భోజనంలో శానిటైజర్ వేస్తున్నాడంటూ ఆరోపించింది.
విచారణకు కృతి ఏమాత్రం సహకరించడం లేదు అని తెలుస్తోంది. తన ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.