-
13న మంత్రి లోకేష్ శంకుస్థాపన
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి అనేది అక్కడి ప్రజల 30 ఏళ్ల కల. అయితే, ఆ మూడు దశాబ్దాల కల తాను నెరవేరుస్తానని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాటిచ్చారు. 91వేల ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించారని, ఇక్కడి ప్రజల ఆకాంక్షను తాను నెరవేరుస్తానని ప్రకటించిన లోకేష్.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా మంగళగిరిలో ఆసుపత్రిని తీర్చి దిద్దేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. మంగళగిరి సమీపంలోని చిన కాకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంద పడకల ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా, దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవన నమూనాలు, ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా వాతావరణం ఏర్పరచాలని సూచించారు. అంతేకాదు.. యేడాదిలోగా ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని అధికారులకు గడువు విధించారు నారా లోకేష్.