తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. రెండువారాల్లో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అతేకాదు.. మార్చి 20వ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమావేశమయ్యారు. ఆ పార్టీ నేతలు భావించిన మాదిరిగానే ముందుగా కులగణన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చించింది ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోద ముద్ర వేయాలి. లేకుంటే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి. ఈ నేపథ్యంలోనే గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్రెడ్డి, ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలను జిల్లాల వారీగా నాలుగు గ్రూపులుగా విభజించి సమావేశమయ్యారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగావున్న సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేల సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. రెండు వారాల్లో నోటిఫికేషన్ ఇచ్చి.. మార్చి 20వ తేదీ లోగా ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయనుంది.