- డిప్యూటీ సీఎం అయిన 24 గంటల్లోనే…
- 2021లో అజీత్ పవార్ ఆస్తులు సీజ్ చేసిన ఐటీ శాఖ
- ఆస్తులు సక్రమమే అని ట్రిబ్యునల్ తాజా తీర్పు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే అజిత్ పవార్ బినామీ ఆస్తులన్నీ సక్రమమైనవేనని బినామీ ఆస్తుల లావాదేవీల అపిల్లేట్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ట్రిబ్యునల్ ఇలా తీర్పు చెప్పిందో లేదో ఆ వెంటనే ఐటీశాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. దాదాపు వెయ్యికోట్ల విలువచేసే ఆస్తులపై ఉన్న ఆంక్షలను సడలించి అజిత్ పవార్ కు అప్పగించింది.2021 అక్టోబర్7న బినామీల పేరుతో ఆస్తులు కలిగి ఉన్నారంటూ అజిత్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ ఐటీ శాఖ సీజ్ చేసింది.మహారాష్ట్ర వ్యాప్తంగా ఆయన,ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న భూములను, ఢిల్లీలోని ఫ్లాట్ ను,సతారాలోని జరందేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ, గోవాలోని రిసార్టులపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీశాఖ వాటన్నింటినీ సీజ్ చేసింది.
తాజాగా ట్రిబ్యునల్ తీర్పులో ఆ ఆస్తులన్ని సక్రమమైనవేనని, బినామీ పేర్లతో ఉన్నఅవి అక్రమమని గతంలో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటికి సరైన సాక్ష్యాలు లేవని అపల్లేట్ ట్రిబ్యునల్ తీర్పు నిచ్చింది. వాటన్నింటి లావాదేవీలు చట్టబద్ధంగానే , న్యాయ వ్యవస్థ పరిధికి లోబడి జరిగినవేనని ధ్రువీకరించింది. బినామీ ఆస్తుల కొనుగోలు కోసం డబ్బు లావాదేవీలు జరిగినట్లు కూడా ఆధారాలు లేవంది.పవార్ కుటుంబానికి,బినామీ ఆస్తులకి మధ్య సంబంధాలతో కూడిన ఆధారాలను అందించడంలో ఐటీ శాఖ విఫలమైందని కూడా అపల్లేట్ ట్రిబ్యునల్ కామెంట్ చేసింది. మహాయుతి కూటమి నేతగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ పరిణామాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.