మరో పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్దే అని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని తన నివాసంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్” జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
అమిత్ షా పార్లమెంటులో మాట్లాడిన తీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేదిగా ఉందని,
మహాత్మా గాంధీని చంపినవారిని ప్రోత్సహించేలా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని రేవంత్ మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగం కారణంగానే దేశంలో సామాజిక పరివర్తన జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఆయనను కనిపించని దేవుడిగా కొలుస్తున్నారని, ప్రతీ గ్రామంలో ఆయన విగ్రహాన్ని పెట్టి ఆరాధిస్తున్నారని, అలాంటి మహనీయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతీ ప్రాంతంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామని రేవంత్ తెలిపారు.
అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుంది, వింటే పడాల్సి వస్తుందన్న కారణంగానే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని, వచ్చిన వాళ్లకేమో ఓనమాలు కూడా రావన్నారు. కనీసం చెప్పినా వాళ్లు నేర్చుకోవడం లేదన్నారు.
సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్కు పోయిందని వాళ్లకు బాధగా ఉందన్నారు రేవంత్. అందుకే కొడంగల్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని.. కానీ, రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొడంగల్ను మాత్రం కంచె వేసి కాపాడే బాధ్యత తమ కార్యకర్తలదే అన్నారు. ఇంకా పదేళ్ల పాటు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్దే ఉంటుందన్న రేవంత్ రెడ్డి.. ఈ పదేళ్లలో కొడంగల్ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాని పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లలో మరో పదివేల కోట్లతో కొడంగల్ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని చెప్పారు.
ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని, భూసేకరణను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని రేవంత్ హామీ ఇచ్చారు.
మన దగ్గర పరిశ్రమలు లేకపోవడం వల్లే మన ప్రజలు వలసలు వెళుతున్నారని, ఇక్కడ పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానికుల కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడడమే తన తాపత్రయమన్నారు రేవంత్ రెడ్డి.