నల్లారి కిరణ్కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి. తన మార్క్ పాలనతో ఉమ్మడి రాష్ట్రంలో ద బెస్ట్ సీఎంగా పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయసాయిరెడ్డి.. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారు. ఇటీవలే రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. దీంతో, త్వరలోనే ఖాళీ అయిన ఆ రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుంది. అయితే, ఆ స్థానంలో నల్లారి కిరణ్కుమార్రెడ్డిని బీజేపీ పెద్దల సభకు పంపిస్తుందన్న చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యింది. కానీ, టీడీపీ నేతలు కూడా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. 2028 జూన్ 21 వరకూ పదవీ కాలం ఉండటంతో దీనిపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు వద్దకు పైరవీల కోసం వస్తున్నారు. టీడీపీ నుంచి ఆశావహులు పెద్దయెత్తున పోటీ పడుతున్నారు. ఎక్కువ సమయం పదవీకాలం ఉండటంతో దేవినేని ఉమ లాంటి వాళ్లు కూడా తమ పేరును పరిశీలించాలని అధినాయకత్వాన్నికోరినట్లు తెలిసింది. అయితే, ఈ స్థానం ఇప్పటికే బీజేపీకి ఫిక్స్ అయిందన్న ప్రచారంతో నేతలు డీలా పడిపోతున్నారు.
త్వరలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టు మాత్రం బీజేపీ నేతలు తమకు కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే, ఆ పార్టీ ఎవరిని నిలబెడుతుందన్నది ఇంతవరకూ బయటకు రాలేదు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేస్తారని కూడా కొందరు అంటున్నారు. అయితే, వీరిద్దరూ కాకుండా కొత్త వారికి, పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం నుంచి ఉన్నవారికి ఇచ్చే ఛాన్స్ ఉందన్న వాదన కూడా కిందిస్థాయిలో నడుస్తోంది. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి పేరు ఖరారు చేసినా కూటమి ప్రభుత్వం దానిని కాదనే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం అవసరం ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేనలు బీజేపీ అభిప్రాయానికి తలవంచే పరిస్థితులు ఉన్నాయి. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి తామే కారణమని, అందుకే తమకే ఈ స్థానం కావాలని ఇప్పటికే కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు స్పష్టం చేసింది. అయితే, ఈ పోస్టు ఎవరికి వెళుతుంది? ఎవరిని చివరకు ఎంపిక చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే కనిపిస్తున్నా, బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అందులోనూ నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేరునే అధిష్టానం ఫైనల్ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.