-
వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లు తప్పనిసరి
-
స్టిక్కర్లు లేని వాహనాలకు భారీ జరిమానా
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరాన్ని ముంచెత్తిన కాలుష్యం నుంచి బయట పడేందుకు గత కొన్నేళ్లుగా పలు రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా కాలుష్యానికి ఎక్కువ కారణమవుతోన్న వాహనాల విషయంలో కొత్తగా ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలో తిరిగే వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లు తప్పనిసరి చేసింది. ఒకవేళ స్టిక్కర్లు లేకుండా వాహనాలు రోడ్లమీద తిరిగితే భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ స్టిక్కర్లు లేకుండా ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలకు రూ.5వేలు జరిమానా విధిస్తారు.
2012-13లో ప్రవేశ పెట్టిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లో ఈ స్టిక్కర్లు అతికించాల్సి ఉంటుంది. ఈ స్టిక్కర్ లేని వాహనాలకు జరిమానా విధించడంతో పాటు.. పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరగదని తాజా ఉత్తర్వుల్లో రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం డీజిల్తో నడిచే వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్ అతికించాలి. అలాగే,పెట్రోల్, సీఎన్జీతో నడిచే వాహనాలకు నీలం రంగు స్టిక్కర్ అతికించాలి. అలాగే, మిగిలిన వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్ అతికించాల్సి ఉంటుంది.