తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే కాకబలి కార్యక్రమం బుధవారం వైదికోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
శ్రీవారికి మహా భక్తురాలైన ఆండాళ్ అమ్మవారు శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్కు బుధవారం ఉదయం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలాలు తిరుపతి నుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్స్వామివారి మఠానికి బుధవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
మంగళవారంతో పవిత్రమైన ధనుర్మాసం ముగియడంతో బుధవారం ఉదయం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమయ్యింది. గత ఏడాది డిసెంబరు 16వ తేదీ ఉదయం నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.