- మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్లో హడల్
- లైన్ క్రాస్ అయితే యాక్షన్ తప్పదు
- రాహుల్ గాంధీ డైరెక్షన్లో మీనాక్షి నటరాజన్
- తెలంగాణ కాంగ్రెస్ లో ఆల్ ఇస్ నాట్ వెల్ అంటున్న మీనాక్షి
- అన్ని స్థాయిల్లో ప్రక్షాళనకు రంగం సిద్ధం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొస్తారనే అంశంపై చర్చ మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో స్పీడు తగ్గిందన్న వాదన బలంగా వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నెగటివ్ ప్రచారం అధికంగా జరగడం పార్టీపరంగా దాన్ని ఎదుర్కోకపోవడం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యవహారాలు ఇన్చార్జిగా ఉన్న దీపా దాస్ మున్షి పనితీరుపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. కిందిస్థాయి నేతల వాదనలు వినే అవకాశం ఉండడం లేదని… ఆమె కేవలం ముఖ్య నేతలతో మాత్రమే అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
కారణాలు ఏమైనా దీపాదాస్ మున్షీ స్థానంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రావడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ కొత్త కాదు. అధిష్టానం లో బాగా పలుకుబడి ఉన్న నేతల్లో ఆమె ఒకరు. మధ్యప్రదేశ్ కి చెందిన ఆమె అక్కడ రాజకీయాలని బలంగా ఎదుర్కొంది. దిగ్విజయ్ సింగ్ వంటి నేతలను కూడా ఎదిరించి నిలబడింది. రాహుల్ గాంధీ టీమ్ లో ఆమె కీలక వ్యక్తిగా చెప్తారు. ముక్కు సూటిగా వెళ్లడం… పార్టీ విషయంలో రాజీ పడకపోవడం అన్నది ఆమెకు ప్లస్ పాయింట్స్. తెలంగాణ విషయంలో ఆమెకు రాహుల్ గాంధీ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలిసింది. తన పేరు చెప్పి ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని మీనాక్షికి రాహుల్ గాంధీ స్పష్టం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అన్ని చక్క పెట్టడానికే ఆమె రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ పెంచడం… కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఒకే లైన్లో ఉండాలన్నది ఆమె అభిప్రాయం. తన పనితీరు నచ్చకపోతే నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆమె అనేక సందర్భాల్లో మధ్యప్రదేశ్ లోనే ప్రకటన చేశారు. వివాదాలు లేకపోవడం. గిఫ్టులకు దూరంగా ఉండడం… అధిష్టానం లైన్ తన లైను ఒకటే అన్న వాదన ఆమెకు బాగా కలిసి వచ్చింది.
తెలంగాణలో పార్టీ పరంగా ఆల్ ఇస్ నాట్ వెల్ అని ఆమె భావిస్తున్నారు. మొత్తానికి ఏడాది కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హడావిడి చేసిన నేతలు ఇప్పుడు మీనాక్షి పేరు చెప్తే భయపడుతున్నారు. ఆమెతో అంత ఈజీ కాదని నేతలు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నేతల మధ్య గ్యాప్… పార్టీని ధిక్కరించి మాట్లాడటం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో మీనాక్షి రాకతో వాటన్నిటికీ పుల్ స్టాప్ పడే అవకాశం ఉందని సీనియర్లు భావిస్తున్నారు.