- కొత్త టీం కావాలంటున్నారు రేవంత్ రెడ్డి
- క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు వేస్ట్ అంటున్న రేవంత్
- మంత్రివర్గ విస్తరణపై ఎటు తేల్చని అధిష్టానం
- ఢిల్లీ ఎన్నికల తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం
- కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై సీయం ఆగ్రహం
- రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై అధిష్టానం స్పందన పై సర్వత్రా ఆసక్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన నేపథ్యంలో ప్లస్లు మైనస్లు అధిష్టానానికి వివరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కొత్తగా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న వాళ్ల పనితీరును సమీక్షించాల్సిన అవసరం కూడా అంతే ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల తీరుపై రేవంత్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయిన నేపథ్యంలో వీళ్ళందరూ పనితీరుపై కొన్ని సర్వే రిపోర్ట్ లు కూడా రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ నివేదికలను అధిష్టానానికి వివరించినట్లుగా తెలిసింది.ఈ నెలాఖరులోగా పిసిసి కొత్త కార్యవర్గం అదేవిధంగా మిగిలిన కార్పొరేషన్ల పదవుల భర్తీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తనకు కొత్త టీం కావాలన్న అంశాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు.
యాక్టివ్ గా ఉన్నవాళ్లు అదే విధంగా బిఆర్ఎస్ను దీటుగా ఎదుర్కునే వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. దాదాపు 40 కార్పొరేషన్లకు ప్రస్తుతం చైర్మన్లు ఉన్నారు. వారిలో చాలామంది యాక్టివ్ గా లేరు అనేది సీఎం అభిప్రాయం. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ పుంజుకుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానాన్ని చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ ఏ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని సీనియర్లు అంటున్నారు. కేవలం కార్పొరేషన్ పదవులు పిసిసి కొత్త కార్యవర్గ ఏర్పాటు వంటి అంశాలకు మాత్రమే ప్రస్తానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా వాటిని భర్తీ చేస్తామని స్వయంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తెలిపారు. సో ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదని అంశం దాదాపుగా ఖరారు అయిందన్నది కొందరు వాదన. ఢిల్లీ ఎన్నికల తర్వాతనే దీనిపై అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ప్రభుత్వంలో, పార్టీలో తన టీం ఉండాలన్నది రేవంత్ రెడ్డి వాదన. ఈ దిశగా ఆయన ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో కూడా ఏలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నదాని పై ఆయన తన అభిప్రాయాన్ని ఇప్పటికే అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. పనిచేయని వారిపై యాక్షన్ తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలిసింది. మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు తనకొద్దని ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఇంకొక ఆరు మందికి క్యాబినెట్లో అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయంగా సామాజికంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గట్టి వారికి అవకాశం ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న టీం తో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావట్లేదన్న తన వాదనను ఆయన అధిష్టానం దృష్టిలో బలంగా పెట్టారు. కాంగ్రెస్లో ఒక వ్యక్తి చుట్టే రాజకీయం తిరగదు కనుక రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం ఏ రకంగా చూస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.