25.6 C
Hyderabad
Tuesday, August 25, 2026

Live Video

spot_img

అమరావతి నిర్మాణంపై అనుమానాలు

అమరావతి రాజధాని రీలాంచ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన పూర్తయిన తర్వాత పాత డిజైన్లతోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కావడంతో పాటు వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్లలో అమరావతి రాజధాని పనులను పూర్తి చేస్తామని చెప్పారు. మోదీ కూడా తన ప్రసంగంలో మూడేళ్లలో పూర్తి అవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణ బాధ్యతలన్నీ మున్సిపల్ మంత్రి నారాయణకు చంద్రబాబు నాయుడు అప్పగించారు.

మూడేళ్లలో అమరావతి నిర్మాణపనులు పూర్తి కావడం అంటే ఆషామాషీ కాదు. 365 రోజులు 24 X 7 పనిచేసినా సమయం సరిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునాదులు తీయడం నుంచి నిర్మాణాలు పూర్తి చేయాలంటే అంత సులువు కాదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్క టవర్ నిర్మాణం చేయాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది. అందుకు అవసరమైన ముడిసరుకుతో పాటు అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో పాటు కార్మికులు కూడా అవసరం. అంతా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులు రాజధాని నిర్మాణ పనులకు తరచూ అంతరాయం కలిగించే అవకాశముంది. సముద్ర తీర రాష్ట్రం కావడంతో నిత్యం వర్షాలతో పాటు తుపానులు కూడా ఏడాదిలో ఎక్కువ సార్లు వస్తుంటాయి. జులై నెల వచ్చిందంటే వర్షాలు మామూలుగా పడవు. ఆగస్టు, సెప్టెంబర్ కొంత తెరిపి ఇచ్చినా… అక్టోబరు, నవంబరు నెలలో తుపానులు పొంచి ఉన్నాయి.

సముద్ర తీర ప్రాంతానికి అమరావతి దగ్గరగా ఉండటంతో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడితే పనులకు ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు. మే నెలలో డిజైన్లు ఖరారై పనిలో దిగి పునాదులు తవ్వేసరికి జులై వచ్చేస్తుంది. ఇక వర్షాలతో పనులు ముందుకు సాగే అవకాశం లేదు. పోలవరం పనులే పదేళ్ల నుంచి వివిధ ఆటంకాలతో పూర్తి కాకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఇంజినీర్లు చెబుతున్నారు. వేసవిలో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి.

మరోవైపు కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉంటుంది. వరద వస్తే అమరావతి ప్రాంతంలో నీరు చేరి పనులకు ఆటంకంగా మారతాయి. వీటికి తోడు పండగలు, పబ్బాలు ఇలా మూడేళ్ల సమయం ఇంత పెద్ద సమయంలో పనులు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చన్నది ఇంజినీరింగ్ నిపుణుల అంచనా. ఏదైనా ఒక భవనం అయితే పూర్తి చేయవచ్చు కానీ. యుద్ధ ప్రాతిపదికపై అన్ని హంగులతో బరిలోకి దిగినా ప్రకృతి ఏ మేరకు రాజధాని నిర్మాణానికి సహకరిస్తుందన్నది చూడాలి.

అనుకున్న సమయానికి అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com