రేవంత్ రెడ్డి, భట్టిలకు ధన్యవాదాలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్
రైతు భరోసా కింద రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ నెలబెట్టుకుని ఎకరాకు పది వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచుతూ రైతు భరోసా ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర క్యాబినేట్ మంత్రులకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. తీవ్రమైన ఆర్థిక నిర్భంధం, ప్రభుత్వాన్ని ఆర్థిక సమస్యలు వేధిస్తున్నప్పటికీ అన్నదాతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలబడటం కాంగ్రెస్ పార్టీ నిబద్దతకు నిదర్శనమని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి, ఆర్థిక విద్వంసం చేసిందని, అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అడ్డగోలు వ్యవహారాలు, కనిషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన పనులు చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం 7లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. 22వేల కోట్లతో రైతులకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలులో క్వాంటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా రైతు భరోసా ఇచ్చామని ఈఏడాది దాన్ని 12వేలకు పెంచి ఇస్తున్నామని అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని పేదలకు, కౌలు రైతులకు కూడా 12 వేల రూపాయల ఇస్తున్నట్లు మహేష్ గౌడ్ వివరించారు. మంచి పధకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భరించలేకపోతున్నాయని అన్నారు. జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసా కార్యక్రమాలపై ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు.