రోదసి పరిశోధనల్లో మన దేశ అంతరిక్ష పరిశోధనా సంస్ధ సోమవారం నూతన అధ్యాయాన్ని రచించనుంది. నేటి రాత్రి అంతరిక్షంలోకి స్పేస్ డాకింగ్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టనుంది. రెండు వేరు వేరు స్పేస్ షిప్ లను అంతరిక్షంలో అనుసంధానించడాన్ని డాకింగ్ అంటారు. అత్యంత ప్రయాసతో కూడిన వ్యవహారం ఈ డాకింగ్. ఎందుకంటే సైంటిస్టుల కళ్ళ ఎదుట జరిగే వ్యవహారం కాదు ఇది. ఎక్కడో లక్షల కిలో మీటర్ల దూరంలో రోదసిలో ఉన్న వ్యోమనౌకలను రెండింటిని సాంకేతిక సహకారంతో అనుసంధానించాలి. ఈ ప్రక్రియలో సైంటిస్టుల ప్రమేయం నామమాత్రం. వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో సంచరించే స్పేష్ షిప్ లు రెండింటిని కంట్రోల్లోకి తీసుకుంటూ ఆరెండు స్పేస్ షిప్పుల కంట్రోలింగ్ సిస్టమ్ తో సమాచారం నెరపుతూ చాలా చాకచక్యంగా అనుసంధాన ప్రక్రియ పూర్తి చెయ్యాలి. ఇందులో కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఆరెండు వ్యోమనౌకలు ఢీకొని పేలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. మొత్తంగా చూస్తే చంద్రమండలంలో అంతరిక్ష కేంద్రం నిర్మించాలంటే అందుకు కావాల్సిన పరికరాలను ఒకేసారి పంపడం అసాధ్యం. అందువల్ల అనేక సార్లు అవసరమైన సాంకేతిక పరికరాలను అంతరిక్షంలోకి పంపి డాకింగ్ ద్వారా వాటిని నిర్ణీత స్ధానాల్లో అమర్చాలి. చంద్రమండలంలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి పరికరాలను, ఆస్ట్రోనాట్లను తరలించే స్పేస్ షిప్ లు కూడా డాకింగ్ ద్వారానే అనుసంధానం అవుతాయి. మన దేశం కూడా చంద్రమండలంలో ఒక అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తోంది. నేడు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జరుగుతున్న స్పేడెక్స్ ప్రయోగం అంతరిక్ష పరిశోధనా కేంద్రం నిర్మాణంలో తొలి అడుగుగా భావించాలి. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి 9.58 నిమిషాలకు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-60 స్పేడెక్స్, 24 ఇన్నోవేటివ్ పేలోడ్స్ లను ప్రయోగించనున్నారు. కక్ష్యలో ఉన్న స్పేస్ షిప్ లను డాకింగ్ అన్ డాకింగ్ చెయ్యడానికి ఇస్రో నేడు రెండు ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో రెండేళ్ళ పాటు పనిచేస్తాయి. ఇస్రో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచంలోనే డాకింగ్ పరిజ్ఞానం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.