ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ కారణంగా మూడు గంటల పాటు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది ఈ శాంతి ఒప్పందం. హమాస్ రిలీజ్ చేసే బందీల పేర్లను రిలీజ్ చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. అయితే ఎవరిని రిలీజ్ చేస్తున్నారనే దానిపై హమాస్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో దాడులను కొనసాగించింది ఇజ్రాయెల్ ఆర్మీ. లిస్ట్ వచ్చే వరకు దాడులను ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. దీంతో కాసేపు సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ముగ్గురు బందీల పేర్లను రిలీజ్ చేయడంతో ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ముగ్గురు బందీలను రిలీజ్ చేయనుంది హమాస్. మిగతా 30 మంది పేర్లను, బందీలను విడతల వారీగా విడుదల చేస్తామని హమాస్ తెలిపింది. ఒప్పందం మొదటి దశ 42 రోజుల పాటు అమల్లో ఉండనుంది. ఈలోపు ఒప్పందంలో ఉన్నట్టుగా మొత్తం 33 మంది బందీలను రిలీజ్ చేస్తోంది హమాస్. అయితే ఒకేసారి 33 మంది పేర్లను రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ కూడా విడతల వారీగా 2 వేల మంది పాలస్తీనా వారిని విడుదల చేయనుంది. మరోవైపు రెండో దశకు సంబంధించిన చర్చలు కొనసాగించాల్సి ఉంటుంది. మొదటి దశ అమలు తీరుపైనా రెండో దశ చర్చలు ఆధారపడి ఉంది. ప్రస్తుతం హమాస్ చెరలో మొత్తం 98 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు 33 మందిని రిలీజ్ చేస్తే మరో 65 మంది బందీలుగా ఉండనున్నారు.