ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాల నేపథ్యంలో ఎన్ఐఏ అప్రమత్తంగా ఉంటోంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్కు వచ్చారు. ముంబై ఎయిర్పోర్ట్లోని రెండో టెర్మినల్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు వారిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీరికి ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో సంబంధాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
2023లో మహారాష్ట్రలోని పుణెలో ఐఈడీ లుడు పదార్థాల తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో ఈ ఇద్దరి కోసం స్థానిక పోలీసులు అప్పటినుంచే గాలిస్తున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో వీళ్లిద్దరూ భారత్లోని స్లీపర్ సెల్స్తో కలిసి దేశంలో ఉగ్రవాద కుట్రలకు ప్లాన్లు వేశారని, అదే ప్రాంతంలో స్లీపర్ సెల్స్కు బాంబుల తయారీలో శిక్షణ కూడా ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. వీరిని పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతిని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
రెండేళ్లుగా పరారీలో ఉన్న వీళ్లిద్దరూ ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ముంబైకి ఎందుకు వచ్చారనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్టులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మంది ఐసిస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.