పీకల్లోతూ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్కు ఇది ఓ సూపర్ న్యూస్. ఎందుకంటే వారి ఆర్థిక కష్టాలను తీర్చే అవకాశం ఇప్పుడు ఆ దేశానికి దక్కినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు బయటపడ్డాయి. అది కూడా ఏకంగా 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను గుర్తించినట్ట్ఉ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ చెబుతోంది. దీని విలువ పాకిస్థాన్ కరెన్సీలో దాదాపు 600 బిలియన్లు.
మొత్తం 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. అటోక్ జిల్లాలో ఈ నిల్వలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే మరి ఈ బంగారం నిల్వల వెలికితీత అంత ఈజీ కాదనేది తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ఇప్పటికే అక్రమ మైనింగ్ ప్రారంభమైందన్న వార్తలు ఉన్నాయి. ప్రతి ఏటా నదిలో నీరు తగ్గగానే చాలా మంది స్థానికులతో పాటు.. అనేక మంది వచ్చి ఈ నదిని జల్లెడ పడుతున్నారు. అయితే బంగారాన్ని వెలికి తీయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు కాబట్టి.. అంతగా లాభాలు లేవని తెలుస్తోంది.
నిజానికి పాక్కు ఉన్న ఆర్థిక కష్టాలు తీరాలంటే ఇలాంటి గనుల అవసరం ఉంది. ఇప్పటికే ఆ దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. అక్కడ నిత్యావసర ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. అయితే కొన్ని చట్టాలు మాత్రం ఈ మైనింగ్ను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటిని మార్చి ఈ ఏడాది చివరి వరకు మైనింగ్ వేలం వేస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు.