తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల గణనకు సంబంధించి లెక్క తేలిందంటున్నారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాల జనాభాపై క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఆ కులగణనకు సంబంధించిన నివేదికలు కంప్యూటరీకరిస్తున్నారు. అయితే, కంప్యూటరీకరణ పూర్తయ్యిందని,లెక్కలు క్రోడీకరిస్తున్నారని సమాచారం. వీటి ఆధారంగా కులగణన ఫుల్ రిపోర్ట్ లీకైందని చెబుతున్నారు. అందుకే రాష్ట్రంలో బీసీల జనాభా, ఇతర సామాజిక వర్గాల జనాభాపై క్లారిటీ వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలోని మొత్తం జనాభాలో 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన సాఫ్ట్ కాపీ నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నందున కులగణన సర్వేను కేబినెట్లో చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించింది. వివిధ వర్గాల నుంచి వివరాలు, వినతులు తీసుకుంది. సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన వివరాలు కూడా ఈ కమిషన్ కు అందాయని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్లో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. దాదాపు నెలన్నర పాటు 90వేల మందికి పైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఆ వివరాలను కంప్యూటీకరించే ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఈ కులగణన సర్వే సమగ్ర నివేదికను ప్రణాళిక సంఘం దాదాపు సిద్ధం చేసిందంటున్నారు. ఈ సమగ్ర కులగణన సర్వేలో భాగంగా మొత్తం కోటి 17లక్షల 47వేల ఇళ్లకు స్టిక్కరింగ్ చేచేయగా, ఇందులో 98 శాతం మేర వివరాలు సేకరించారు. ఈ లెక్కలను పరిశీలిస్తే.. 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తేలింది. మిగతా 45 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు ఉన్నట్టు సమాచారం. ఇక కులగణన సర్వేకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన పూర్తిస్థాయి రిపోర్టును త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.