37.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ఛాంపియన్స్ టోర్నీ నిర్వహణ పాక్‌తో అయ్యే పనేనా?

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవడానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ట్రోఫిని సాధించాలన్న కసి ఛాంపియన్ దేశాలన్నింటిలో కనిపిస్తోంది. కానీ టోర్నిని నిర్వహించడంలో పాకిస్థాన్‌ సక్సెస్ అవుతుందా? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది. ఎందుకంటే పాక్‌లో మ్యాచ్‌లు అనగానే చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫికి పాకిస్థాన్‌ సరైన ఏర్పాట్లు చేయగలదా? ప్లేయర్ల సెక్యూరిటీ విషయం ఏంటి? పేరు మోసిన స్టేడియాలు లేవు కదా? ఆటగాళ్లు సౌకర్యంగా ఉంటారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. పాకిస్తాన్‌లో టోర్నీ నిర్వహించడంపై ప్రతి ఒక్క దేశం అసంతృప్తిగానే ఉంది. అయితే ఈ భయాలను నిజం చేసే ఘటన ఒకటి జరిగింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నాం అని చాలా గొప్పగా చెప్పుకుంది. కానీ ఆ స్టేడియం వల్లే ఇప్పుడు న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడేందుకు కారణమైంది.

చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతుంది. నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి రచిన్ నుదుటికి బలంగా తాకడంతో రక్తమోడుతూ గ్రౌండ్‌ను వీడాడు. బంతి తగలగానే నొప్పితో అతడు విలవిల్లాడాడు. మోకాళ్ల మీద అలా కూర్చుండిపోయాడు. రక్తం ఎంతలా కారిందో ప్రపంచం మొత్తం చూసింది. ఫీల్డింగ్‌లో అదరగొట్టే రచిన్‌ స్ట్రెయిట్‌గా తన చేతుల్లోకి వచ్చే ఓ బాల్‌ను ఎందుక అంచనా వేయలేకపోయాడనేది ఓ ప్రశ్నగా మారింది. రచిన్‌కు దెబ్బ తగిలిన విధానంతో స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మెడికల్ టీం రచిన్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ గాయం కారణంగా రచిన్ టోర్నీకి దూరం అయ్యే అవకాశం కూడా ఉంది.

రచిన్‌ క్యాచ్ పట్టుకునే సమయంలో బాల్ కనిపించలేదని, ఫ్లడ్ లైట్ వెలుతురు సరిగా లేదని తేలింది. నాసిరకం ఫ్లడ్ లైట్లు వాడటం వల్లే ఇలా జరిగిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన నాటికి.. గడాఫీ స్టేడియం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. గ్రౌండ్, సీటింగ్, పిచ్ ఇలా ఏదీ రెడీ కాలేదు. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఐసీసీ కమిటీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను హెచ్చరించింది. గడువులోగా నిర్మాణం పూర్తి చేయకపోతే.. వేదికను దుబాయ్‌కి మార్చుతామని తేల్చిచెప్పింది. దీంతో మూడు రోజుల క్రితం స్టేడియం నిర్మాణం పూర్తి చేసి.. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచ్ నిర్వహించింది. దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఐసీసీ స్థాయి టోర్నీకి ఇలాంటి స్టేడియాలను ఎంపిక చేయడం ఏంటని విమర్శలు మొదలయ్యాయి. క్రికెటర్లలో కూడా ఓ రకం భయం మొదలైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com