- రతన్ టాటా ఆస్తుల విలువ రూ. 500 కోట్లు
- వందల కోట్లలో ఆస్తులున్నా జన్మతః వారసులు లేరు
- మెజారిటీ ఆస్తులను సేవారంగానికే కేటాయింపు
- హైకోర్టు మొత్తం ఆస్తులను క్రోడీకరించాకే కేటాయింపు
- కనీసం ఆరునెలలు పట్టే అవకాశం
- మోహినీ మోహన్ దత్తా తో టాటా అనుబంధం
- ఆస్తుల్లో పెట్ డాగ్ టిటోకు కూడా సేవింగ్స్
- సోదరుడు, వదినలు, ఇతర డిపెండెంట్లకూ వాటా
- తన ఇంటి సిబ్బందికి, కార్యాలయాల సిబ్బందికి కూడా
- శంతను నాయుడుకి కూడా కొంత వాటా
ఇటీవల దివంగతులైన ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా వారసులెవరు? దీనిపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏవేవో పేర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఆయన అసలు వారసులెవరన్నది మొన్న మొన్నటి వరకూ సందిగ్ధం గానే ఉండేది. అయితే ఈ సందిగ్థతకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రతన్ టాటా విల్లులో ఆయన ఆస్తులకు వారసుడిని ప్రకటించే కన్నుమూశారు. ఇన్నాళ్లకు లాయర్లు వెలికి తీసిన డాక్యుమెంట్లలో వారసుడి పేరు బయటకొచ్చింది. ఆయనెవరో కాదు ఆయనతో పాటు వ్యాపార భాగస్వామిగా ఉన్న మోహినీ మోహన్ దత్తాను వారసుడిగా విల్లులో పేర్కొన్నారు. రతన్ టాటా వారసత్వం కింద పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని జమచేసి వెళ్లారు. ఆయనకున్న స్థిర, చర ఆస్తుల విలువ మొత్తంగా రూ.500 కోట్లు.అందులో మూడో వంతు వాటాను మోహన్ దత్తాకు చెందాలని కోరుతూ ఆయన విల్లు రాశారు. అయితే మోహన్ దత్తా గురించి రతన టాటా బంధుగణానికి గానీ, టాటా అంతర్గత సన్నిహితుల సర్కిల్ కి కానీ తెలియదు. తన ఆస్తులకు వారసులుగా టాటా ప్రకటించిన జాబితాలో ఉన్న మోహన్ దత్తాకు ఈఆస్తి ఇప్పట్లో రాదు. ఎందుకంటే ఆ ఆస్తులన్నింటినీ హైకోర్టు సమక్షంలో లెక్కించి వాటిని జాబితాగా రూపొందించి కోర్టు సర్టిఫై చేశాక మాత్రమే అందుతాయి. ఈ ప్రక్రియ జరగడానికి కనీసంఆరు నెలలు పట్టొచ్చు.
ఎవరీ మోహినీ మోహన్ దత్తా?
జెంషెడ్ పూర్ కు చెందిన వ్యాపార వేత్త అయిన మోహినీ దత్తా స్టాలియన్ కంపెనీ కో ఓనర్.ఆ కంపెనీ తదనంతర కాలంలో టాటాగ్రూప్ లో విలీనమైంది.అయితే కంపెనీ కలిసిపోయే నాటికి మోహన్ దత్తాకు అందులో 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ కు చెందినది.
అరవయ్యేళ్ల అనుబంధం ఇది…
రతన్ టాటా అంత్యక్రియలకు వచ్చినప్పుడు దత్తా తనకు టాటా తో పరిచయం ఈనాటిది కాదని, తాను 24 ఏళ్ల వయసునుంచే టాటాతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నానని చెప్పారు.ఇద్దరూ తరచుగా జెంషెడ్ పూర్లోని డీలర్స్ హాస్టల్ లో కలిసేవారమని గుర్తు చేసుకున్నారు.విల్లులో ఆయన పేరు కనపడేందుకు ముందు వరకూ ఆయనెవరో ఎవరికీ తెలీదు. అయితే టాటా కుటుంబంతో ఆయన సన్నిహిత సంబంధాలు మాత్రం కలిగి ఉన్నారు.టాటా తనకు చాలా రకాలుగా సాయపడ్డారని, సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించారనీ దత్తా అన్నారు.రతన్ టాటాతో మోహినీమోహన్ దత్తాకు ఏకంగా ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. టాటా చివరి పుట్టిన రోజు వేడుకలు 2024 డిసెంబర్ ముంబైలోని ఎన్సీపిఏ హాలులో జరిగాయి. ఆ వేడుకలకు దత్తా కూడా అటెండ్ అయ్యారు.
దత్తా కుమార్తె కూడా ఇందులోనే…
మోహన్ దత్తా కుమార్తె కూడా టాటా అనుబంధ పరిశ్రమల రంగంలోనే ఉన్నారు ఆమె 2015 వరకూ తాజ్ హోటల్స్ లో పనిచేశారు, ఆ తర్వాత టాటా ట్రస్ట్ కు బదిలీ అయ్యారు.అక్కడ 2024 వరకూ కొనసాగారు.
విల్లులో ఏముంది?
ఇంతకీ రతన్ టాటా విల్లులో ఏముంది? ఎవరెవరి పేర్లున్నాయ్ అన్నది అందరికీ ఉత్కంఠే. ఆయన మరణానంతరం రెండు వారాల తర్వాత అది వెల్లడైంది.టాటా తన ఆస్తులను ఏడు భాగాలుగా విభజించారు. సోదరుడు, వదినలు, ఆయన ఇంటిసిబ్బంది, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడులకు తన ఆస్తులను పంచాలని టాటా కోరుకున్నారు.ఆయన పెట్ డాగ్ టిటో అంటే ఆయనకు పంచ ప్రాణాలు. తన ఆస్తులలో అది బతికి ఉన్నన్నాళ్లు దాని తిండి ఖర్చు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చుల కోసం ఆయన కొంత సొమ్మును కేటాయించారు.అలాగే తన షేర్ల వాటాను రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కు బదిలీ చేయాలని కోరారు. ఆయన స్థిరాస్థుల్లో ఆలీబాగ్ లో ఉన్న బీచ్ ఫేస్ బంగ్లా,జుహూలోని మూడంతస్తుల భవనం, అలాగే రూ.350 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు, టాటా సన్స్ గ్రూప్ లో ఒకశాతం వాటా ఉన్నాయి.