చాంపియన్స్ ట్రోఫీ ముగియగానే క్రికెట్ జోష్ను మరింత పెంచేందుకు ఐపీఎల్ సిద్ధంగా ఉంది. అయితే ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దానిపై కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే దీనికి సంబంధించి రెండు తేదీలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. బీసీసీఐ కానీ, ఐపీఎల్ కానీ ఇంకా అధికారికంగా షెడ్యూల్ ప్రకటించలేదు.. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్ కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందనేది మాత్రం నిజం.
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభవుతుందని ప్రకటించారు. ఆయన నోటి వెంట ఈ మాటలు రాగానే అన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు ఈ విషయాన్ని ప్రచారం చేశాయి. చాంపియన్స్ ట్రోఫి మార్చి 9న ముగియనుంది. సరిగ్గా ఈ ఈవెంట్ ముగిసిన రెండు వారాల తర్వాత ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభవుతుందని తెలుస్తోంది.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రముఖ క్రికెట్ ఏజెన్సీస్ ESPNCricinfo, Cricbuzz మాత్రం మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందని ప్రకటించాయి. దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలైన డేట్ ఎప్పుడని క్రికెట్ అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. దీనిపై బీసీసీఐ మళ్లీ స్పందించలేదు. అలాగని శుక్లా చెప్పిన విషయాన్ని కన్ఫామ్ చేసుకుందామా అంటే ఆయన ఐపీఎల్ చైర్మన్ కూడా కాదు. సో..దీనిపై క్లారిటీ రావాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.
ఈ కన్ఫ్యూజన్ కేవలం మ్యాచ్ ప్రారంభమయ్యే తేదీల విషయంలోనే కాదు.. ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందనే దానిపై కూడా నెలకొంది. ఇప్పటి వరకు తొలి మ్యాచ్, ఫైనల్స్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరుగుతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వేదిక కూడా మారే చాన్స్ కనిపిస్తోంది. ఐపీఎల్ సాంప్రదాయం ప్రకారం గతసారి సీజన్లో టైటిల్ విజేత సొంత వేదికలో టోర్నీ తొలి, ఫైనల్ మ్యాచులను నిర్వహించాలి. ఇదే రూల్ను ఫాలో అయితే ఈడెన్లోనే మ్యాచ్లు జరగాలి. ఇక గతేడాది రన్నరప్గా నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగాలి. మరి ఈసారి ఐపీఎల్ మేనేజ్మెంట్ వీటి విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది చూడాలి.
మొత్తానికైతే లాస్ట్ సీజన్లాగానే మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఏదేమైనా త్వరలో జరగబోయే బీసీసీఐ మీటింగ్లో పూర్తి షెడ్యూల్ ఫైనల్ కానుంది.