పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన యుద్ద వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంటుని నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025 ని సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తిరిగి 2025 ఐపీఎల్ సిరీస్ ని ఎప్పుడు ప్రారంభించేది, ఏ వేదికల మీద నిర్వహించే వివరాలను త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ద వాతావరణం కమ్ముకున్న పరిస్ధితుల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు నిర్వహించలేమని బీసీసీఐ తెలిపింది. దేశ రక్షణ, ఐపీఎల్ ఆటగాళ్ల భద్రత తమకు ప్రధమ ప్రాధాన్యత అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశలో ఉంది. లీగ్ మ్యా్చ్ లతో పాటు ఫస్ట్ ఎలిమినేటర్, సెకండ్ ఎలిమినేటర్లు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగవల్సి ఉంది. అయితే అనుకోని పరిస్ధితుల్లో భారత్ పాక్ మాధ్య ఉద్రిక్తతలు తలెత్తి యుద్ద వాతావరణం అలుముకోవడంతో ప్లేయర్ల భద్రత దృష్ట్యా ఐపీఎల్ 2025ని నిరవధికంగా వాయిదా వేశారు.