-
జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ
-
అర్థరాత్రి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్
-
9 ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ ఎటాక్స్
-
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
-
మిస్సైళ్లతో ఉగ్రవాదులపై ప్రతీకారం
పహెల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి వాటిని భారత సైన్యం నేలమట్టం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. వీటిలో కొన్ని పాకిస్తాన్లో ఉండగా.. మరికొన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లి, గుల్పూర్, బింబర్ సహా.. పాకిస్తాన్లోని సియాల్ కోట్, చక్ అమ్రు, మురిద్కే, బహవల్పూర్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది.
ఆపరేషన్ సింధూర్ :
ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.44 గంటలకు వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను మాత్రం టార్గెట్ చేయలేదని ఆర్మీ తెలిపింది. భారత్ చాలా జాగ్రత్తగా టార్గెట్లను ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టాయి. భారత్ పై దాడులకు కుట్ర పన్నిన, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే నాశనం చేసినట్టు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ దాడి తర్వాత పహెల్గాం బాధితులకు న్యాయం దక్కిందని భారత ఆర్మీ సోషల్ మీడియాలో 1.51 గంటలకు పోస్టు పెట్టింది. పహెల్గాంలో అమానవీయ దాడి జరిపారని, దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం కాసేపట్లో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించనుంది.
భారత్ స్ట్రైక్స్ను ధృవీకరించిన పాకిస్తాన్ :
భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ను పాకిస్తాన్ ధ్రువీకరించింది. బహవల్పూర్, కోట్లి, ముజఫరాబాద్లలోని మూడు ప్రాంతాల్లో భారత్ దాడులు జరిపిందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ విమానాలు కూడా గగనతలంలో చక్కర్లు కొట్టాయని వివరించింది. కానీ, భారత్ తన సొంత గగనతలం నుంచే ఈ దాడులు జరిపిందని పేర్కొంది. ఈ దాడులను తాము వదిలిపెట్టబోమని, తాము నిర్దేశించుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రాంతంలో స్పందిస్తామని తెలిపింది. భారత తాత్కాలిక సంతోషాన్ని శాశ్వత విషాదంతో భర్తీ చేస్తామని హెచ్చరించింది. అంటే.. పాకిస్తాన్ ఇంకా ఉగ్రబుద్ధని వదులుకోవడం లేదని అర్థమవుతోంది.