- వెనక్కు పంపేదుకు ట్రంప్ కొత్త ఎత్తుగడ
- మరణించినవారి జాబితాలో ఇమ్మిగ్రెంట్లు
- వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ల రద్దు
- బ్యాంకు లావాదేవీలు, ఇతర సేవలు రద్దు
- టాక్స్ రికార్డులు, ఇతర వివరాల ఆరా
- తొలి జాబితాలో 6వేలమంది ఇమ్మిగ్రెంట్లు
- వీరంతా బైడెన్ హయాంలో వచ్చినవారే
- టెంపరరీ వర్క్ ఆర్డర్ మీద అమెరికాలో
- పర్సనల్ డేటాను యాక్సెస్ చేయడంపై నిరసనలు
- ట్రంప్ ఆదేశాలు చెల్లవని ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు
అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రంట్లను తరిమేయడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. దాదాపు 6 వేల మంది ఇమ్మిగ్రెంట్లను చనిపోయిన వారి జాబితాలో చేర్చేశారు. వారంత వారుగా సెల్ఫ్ డిపోర్టేషన్ పై వెనక్కి వెళ్లేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీరంతా అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో పాలసీ పరంగా చట్ట బద్ధంగా అమెరికాలో ఉండేందుకు అనుమతులున్నవారే. వారందరినీ ఇప్పుడు చనిపోయిన జాబితాలో చేర్చడం వల్ల వారికి ఉపాధి దొరకదు సరికదా ఇతర సౌకర్యాలు కూడా వర్తించవు.. వీరి సోషల్ సెక్యూరిటీ నెంబర్లన్నింటినీ రద్దు చేశారు.
ఇదంతా వారు తమ, తమ దేశాలకు తిరుగుముఖం పట్టేందుకే.
అమెరికాలో ఉండేందుకు వారందరికీ 9 అంకెల సోషల్ సెక్యూరిటీ నంబర్లను గత ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చింది. వీరిలో కొందరు టెంపరరీ వర్కింగ్ రెసిడెంట్లు, కొందరు పర్మనెంట్ రెసిడెంట్లు కూడా ఉన్నారు. ఈ సోషల్ సెక్యూరిటీ నంబర్ల వల్ల వారి ఆదాయాలను ఆన్ లైన్ లో ట్రాక్ చేయవచ్చు.అలాగే సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడీ నంబర్లను రద్దు చేయడం ద్వారా వారందరికీ అనేక ఆర్ధిక సేవలు అందడం ఆగిపోతుంది. బ్యాంకు లావాదేవీలు, ఇతర కనీసావసరాలు పొందడం కూడా కష్టమవుతుంది. గతంలో జో బైడెన్ హయాంలో ఏర్పాటు చేసిన సీబీపీ వన్ యాప్ ఆధారంగా వచ్చిన 9 లక్షల మంది ఇమ్మిగ్రెంట్లు ఇప్పుడిక ఇంటి ముఖం పట్టాల్సిందే. బైడెన్ హయాంలో అధ్యక్షుడి విశేషాధికారాలు వినియోగించి తెచ్చిన పాలసీ ఈ సీబీపీ యాప్. దీని ద్వారా అమెరికాలో ఎంటర్ అయిన ఇమ్మిగ్రెంట్లు రెండేళ్ల పాటు అమెరికాలో ఉండి ఉపాధి చూసుకోవచ్చు.
ఇప్పుడీ ఇమ్మిగ్రంట్లపై అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ కొరడా ఝళిపిస్తోంది. వారంతా తమంత తాముగా వెనక్కు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటోంది. క్యూబా, హైతీ, నికారాగువా దేశాలకు చెందిన వేలాంది మంది టెంపరరీ లీగల్ స్టేటస్ ద్వారా అమెరికా వచ్చారు. వారంతా ఇపుడు వెనక్కు వెళ్లాలి.అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చెల్లనేరదంటూ ఒక ఫెడరల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన నిర్ణయాలపై దావా వేస్తామని డెమోక్రసీ ఫార్వార్డ్ సంస్థ అడ్వకసీ గ్రూప్ సిఈవో స్కై పెర్రిమాన్ అన్నారు. ఈ ఇమ్మిగ్రంట్ల టాక్స్ పేయర్ డాటాలను సైతం ట్రంప్ ప్రభుత్వం యాక్సెస్ చేయడంపై విమర్శలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. ఇమ్మిగ్రెంట్ల తరిమి వేత పేరుతో లక్షలాది మంది అమెరికన్ టాక్స్ పేయర్ల పర్సనల్ డాటాను యాక్సెస్ చేయడం చట్టవిరుద్ధమని ఎలన్ మస్క్ టీమ్ వీటిని యాక్సెస్ చేయడం చెల్లదనీ ఒకఫెడరల్ జడ్జి ఆదేశించారు. మస్క్ టీమ్ కు ఆ డాటా అందకుండా టెంపరరీగా బ్లాక్ చేశారు.