వైఎస్ఆర్ సీపీ నేతల దాడిలో గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుకు హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్ చేసి పరామర్శించారు. విధి నిర్వహణలోని అధికారిపై పిడిగుద్దులతో విరుచుకుపడిన ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ప్రభుత్వం మారినా కడప జిల్లాలో నేటికీ అధికారులు, సామాన్యులపై దాడులు జరుగుతుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారానికి, ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి, అధికారి గొంతుపైనే కాలేసి తొక్కి, నానా దుర్భాషలాడి పిడిగుద్దులతో విచక్షణరహితంగా దారుణంగా ప్రవర్తించిన వారందరినీ వదలమని హోంమంత్రి పేర్కొన్నారు. ఎంపీడీవో జవహర్ బాబుకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, భద్రత ఏర్పాట్లు చేస్తామని హోంమంత్రి ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి హోంమంత్రి ఫోన్ చేసి ఎంపీడీవోపై దాడి ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రికి జిల్లా ఎస్పీ వివరించారు.
మొత్తం 20 మంది వైసీపీ నాయకులు దాడిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడం సహేతుకమైన చర్యకాదని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు పాల్పడిన వారిపై అవసరమైతే రౌడీ షీట్ తెరవడానికీ వెనకాడబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.