హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ.), జేబీఎస్ నుండి శామీర్పేట (21 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ (40 కి.మీ.) వరకు మూడు కీలకమైన మెట్రో మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి మెట్రో హబ్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. దీని రూపకల్పన జపాన్లోని రవాణా వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుంటుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ ‘బి’లో భాగంగా ప్రతిపాదించిన కీలకమైన మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదించాల్సి ఉంది. బోర్డు ఆమోదం తర్వాత.. రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి ఆమోదించి తుది అనుమతి కోసం డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. రెండో దశ ‘బి’లో హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలకు మెట్రో అనుసంధానాన్ని విస్తరించేందుకు ముఖ్యమైన ప్రతిపాదనలున్నాయి. ఇందులో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుండి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్ల మేర ఒక మార్గం, జేబీఎస్ నుండి శామీర్పేట వరకు 21 కిలోమీటర్ల మేర మరొ మార్గం ప్రతిపాదించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం డీపీఆర్ను కూడా సిద్ధం చేశారు.
విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుండి ప్రారంభమై.. కొత్తగా ప్రతిపాదించిన మెట్రో రైలు డిపో పక్కనుంచి.. విమానాశ్రయ సరిహద్దు గోడ వెంబడి ఆకాశ మార్గంలో కొనసాగుతుంది. ఇది మాన్సాన్పల్లి, బహుదూర్గూడ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సర్వీస్ రోడ్డులో వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అక్కడి నుండి, ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రహదారి ద్వారా కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ , మీర్ఖాన్పేట వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర ఈ మార్గం విస్తరించనుంది. ఈ డీపీఆర్ను మొదట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) బోర్డు ఆమోదించాలి.
ఈ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఎండీతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యదర్శులు హెచ్ఎండీఏ కమిషనర్ డైరెక్టర్లుగా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు.. జేబీఎస్ వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి మెట్రో హబ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రితో పాటు జపాన్ పర్యటనకు వెళ్లిన మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అక్కడి అనుభవాలను మెట్రో హబ్లో పొందుపరిచేందుకు కృషి చేస్తున్నారు. జపాన్లో బుల్లెట్ రైళ్లు, మెట్రో, సాధారణ రైలు సదుపాయాలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉంటాయి. ప్రయాణికులు ఒక రైలు నుండి మరొక రైలుకు సులభంగా మారేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది. ఇదే తరహా అనుసంధాన వ్యవస్థను జేబీఎస్ మెట్రో హబ్లో కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.