కనకవర్షం కురవడం… కలలో.. లేదా సినిమాల్లో చూడటమే. చైనాలో ఇప్పుడిలాంటి సిట్యూవేషనే ఉంది. న భూతో.. న భవిష్యత్ అనేలా అత్యంత భారీగా బంగారు నిలువలున్నా గని చైనాలో బయటపడినట్టు తెలుస్తోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ గనుల్లో 100 మెట్రిక్ టన్నుల బంగారం ఉండొచ్చని తెలుస్తోంది. లెటెస్ట్గా నిర్వహించిన సర్వేల్లో తేలిన విషయం ఇది. భూమికి 2 కిలోమీటర్ల లోతులో 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలకు సంబంధించిన గనులు బయటపడినట్లు చైనా చెబుతోంది.
అత్యాధునికమైన 3డీ మోడలింగ్ టెక్నాలజీ ఉపయోగించి.. భూమిలో మరింత ఎక్కువ లోతుకు వెళ్లి బంగారు నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. భూమిపై నుంచి 3వేల మీటర్ల లోతులో ఈ గోల్డ్ మైన్స్ ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ఈ బంగారం విలువ మొత్తం సుమారు 83 బిలియన్ అమెరికా డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.7 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే ప్రపంచ గోల్డ్ మార్కెట్లో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో 2వేల టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో దాదాపు 10 శాతం చైనాలోని మైనింగ్ నుంచే వెలికి తీస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ బంగారాన్ని కూడా చైనా బయటికి తీస్తే చైనాపై కనకవర్షం కురిసినట్టే కదా.