తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబసభ్యులపై మండిపడ్డారు. తాను కొడితే మామూలుగా ఉండదన్న కేసీఆర్ మాటలను మరోసారి వల్లెవేశారు రేవంత్ రెడ్డి. మీ వాళ్లనే గట్టిగా కొట్టు అని కేసీఆర్కు సలహా ఇచ్చారు. నీ బిడ్డను, నీ కొడుకును, నీ అల్లుడిని, నీ సడ్డకుని కొడుకుని గట్టిగా కొడితే బుద్ధి వస్తుందని, మామూలుగా కాదు.. కట్టెతో కొట్టాలని సలహా ఇచ్చారు. ఎందుకో కూడా క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కూతురు కవిత లిక్కర్ స్కామ్ కారణంగా ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడని, అంతేకాకుండా.. ఢిల్లీలో కేజ్రీవాల్ను కూడా ఓడించిందని, అందుకే కూతురిని కట్టెతో గట్టిగా కొట్టాలన్నారు రేవంత్. అలాగే, కేటీఆర్ను, హరీష్రావును, సంతోష్రావును కూడా కొట్టాలంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇక, కులగణనపై వస్తున్న విమర్శలపై మరోసారి మాట్లాడారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పారదర్శకంగా కులగణన చేశామన్నారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపించారని, అప్పుడు వాళ్లు కాకి లెక్కలతో సర్వే చేసి.. ఇప్పుడు తమ సర్వే తప్పు అనడమేంటని మండిపడ్డారు. కులగణనపై విపక్షాలు చేస్తున్నదంతా దుష్ప్రచారమన్నారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు కూడా లేదని ఘాటుగా విమర్శించారు.