లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం పొంచి ఉందని, ఇప్పటికైనా ప్రశ్నించకుంటే తమకు చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల డీ లిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చూపించే వివక్షతో దక్షిణాది పూర్తిగా నష్టపోతుందని, జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలున్నాయని, దేశాభివృద్ధిలో మందున్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందన్నారు. డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందన్నారు కేటీఆర్.
తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తిగా తీసుకుంటామని, అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందని, ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి మాదిరిగా పనిచేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత చేయనున్న డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువల్ల ఇప్పుడు దక్షిణాదికి నష్టం జరుగుతుందన్నారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదన్నారు.
దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందన్నారు. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ, దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయన్నారు. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదని, ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుందన్నారు. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నదన్నారు. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదన్న కేటీఆర్.. ఈ మధ్యకాలంలో ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు. బిజెపి సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నదన్నారు. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశమన్నారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని తాము వ్యతిరేకించడం లేదని, నిధుల కేటాయింపుల వివక్షను మాత్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.